బంజారాహిల్స్, డిసెంబర్ 25: ట్రాన్స్జెండర్ల గ్రూపుల మధ్య ఆధిపత్యపోరు తారస్థాయికి చేరుకుంది. దీంతో పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. తమపై రౌడీలను ఉసిగొల్పడంతోపాటు తప్పుడు కేసులు పెట్టిస్తున్న మోనాలిసా, లాస్య అనే ట్రాన్స్జెండర్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ.. కొంతమంది హిజ్రాలు బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ వద్ద ఆదివారం చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది.
మోనాలిసా గతంలో ఐడీపీఎల్ ప్రాంతంలో ఉండేదని, ఇటీవల బంజారాహిల్స్ ప్రాంతానికి వచ్చి ఇబ్బంది పెడుతున్నదని, ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ కొంత మంది హిజ్రాలు పోలీస్స్టేషన్ వద్ద బైఠాయించడంతో పాటు కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించడంతో కలకలం చెలరేగింది. తమమీద దాడులు చేయించడంతో పాటు బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో కేసు పెట్టేందుకు వచ్చిన మోనాలిసాను అరెస్ట్ చేయాలంటూ హిజ్రాలు డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి రెండు గ్రూపులను చెదరగొట్టారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ నరేందర్ హెచ్చరించారు. ఇదిలా ఉండగా స్టేషన్లో సోనమ్ రాథోడ్ చేసిన హంగామాపై ఎస్ఐ అంభికా ఫిర్యాదు చేశారు. దీంతో సోనమ్తో పాటు మరికొందరిపై కేసులు నమోదు చేశారు.