Osmania Hospital | సుల్తాన్బజార్, డిసెంబర్ 12: ఉస్మానియా దవాఖాన చరిత్రలో మొట్టమొదటిసారిగా ఓ ట్రాన్స్జెండర్ను పురుషునిగా మార్చే శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. దీంతో 23 ఏండ్ల సోంపెల్లి సోని యశ్వంత్కుమార్గా మారిపోయారు. లింగ డిస్ఫోరియా (మానసిక రుగ్మత)తో బాధపడుతున్న సోనికి ట్రాన్స్ మేల్ శస్త్ర చికిత్స నిర్వహించినట్టు ఉస్మానియా వైద్యులు తెలిపారు. పుట్టుక సమయంలో సోనిని వైద్యులు బాలికగా నిర్ధారించారు. అయితే ఆమె శరీరంలో జరుగుతున్న మార్పులను పరీక్షించిన ఎండోక్రైనాలజీ వైద్య బృందం హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీని అందించారు.
ఇటీవల శాశ్వతంగా పురుషునిగా మార్చే ప్రక్రియను ప్రారంభించారు. మొదటి దశలో లాప్రోస్కోపిక్ వ్జైనల్ హిస్టరెక్టరమీ నిర్వహించారు. అనంతరం ట్రాన్స్మేల్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. శస్త్రచికిత్సలో పాల్గొన్న వైద్యుల బృందాన్ని దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ బీ నాగేందర్ అభినందించారు. ఉస్మానియా దవాఖానలో ఇటీవలనే ట్రాన్స్ జెండర్లకు వైద్య సేవలను ప్రారంభించామని తెలిపారు. ట్రాన్స్ మేల్ శస్త్రచికిత్స అనంతరం రోగి నిలకడగా కోలుకుంటున్నారని తెలిపారు. తనకు ఎటువంటి ఖర్చు లేకుండా ట్రాన్స్ మేల్ శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించిన వైద్యులందరికి యశ్వంత్గా మారిన సోని ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉస్మానియా దవాఖాన ఆర్ఎంవోలు డాక్టర్ సాయిశోభ, డాక్టర్ బండారి శ్రీనివాసులు, డాక్టర్ కవిత, డాక్టర్ రఫీ, డాక్టర్ మాధురి, డాక్టర్ అనురాధ, డాక్టర్ విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.