మలక్పేట, జనవరి 7 : ట్రాఫిక్ నియమాలను పాఠశాల స్థాయి నుంచే పాఠ్యాంశంగా బోధించాలని బేగంపేట ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్(టీటీఐ) ఏసీపీ జి.శంకర్రాజు అన్నారు. శనివారం దిల్సుఖ్నగర్లోని గడ్డిఅన్నారం ఎక్స్రోడ్ వద్దగల ప్రగతి మహిళా డిగ్రీ కళాశాలలో ట్రాఫిక్ నియమాలు, మోటార్ వెహికిల్ యాక్ట్ 1988, 2019లపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. వేగంకన్నా.. ప్రాణం మిన్నా అని, ఎంత తొందరగా చేరుకున్నామన్నది ముఖ్యం కాదని.. సురక్షితంగా చేరుకున్నామన్నదే ముఖ్యమని తెలిపారు. స్పీడ్ థ్రిల్ నిస్తుందని, కాని కిల్ చేస్తుందని తెలిపారు.
రోడ్డు ప్రమాదాల బారినపడకుండా సురక్షిత ప్రయాణాలకోసం ప్రతిఒక్కరూ భద్రతా నియమాలను పాటించాలని సూచించారు. ట్రాఫిక్ నియమాలపై అవగాహన లేనివారే ఎక్కువగా ప్రమాదాలబారిన పడుతున్నట్లు ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాల సీసీ ఫుటేజీల ఆధారంగా తెలుస్తుందన్నారు. మైనర్, సెల్ఫోన్ డ్రైవింగ్లు ఎక్కువైనాయని, మైనర్ డ్రైవింగ్ ప్రమాదకరం, చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు. సెల్ఫోన్లలో సంభాషిస్తూ అనేకమంది రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారన్నారు. ఈ సందర్భంగా ర్యాష్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రమాదాల బారిన పడిన రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వీడియోలను చూపించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మలక్పేట ఎస్సై జయంత్, హెడ్ కానిస్టేబుల్ కొండన్న, కానిస్టేబుల్ ఉపేందర్ నాయక్, సిబ్బంది అబ్దుల్ మాజిద్ఖాన్, చిరంజీవి, విద్యార్థినులు పాల్గొన్నారు.