అర్ధరాత్రి ట్రాఫిక్ పోలీసులు చూడడం లేదనుకుంటున్నారా? ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినా ఎవరూ పట్టించుకోరని భావిస్తున్నారా? అయితే అది భ్రమే. ప్రధాన రహదారులు, చౌరస్తాల్లో ట్రాఫిక్ పోలీసులు లేకున్నా నిఘా కెమెరాలు మాత్రం నిద్రపోవడం లేదు. వాహనదారులు ఉల్లంఘనలకు పాల్పడిన వెంటనే క్లిక్మనిపిస్తున్నాయి. ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తున్న వారిని పట్టేస్తూ చలాన్లు జారీ అయ్యేలా చూస్తున్నాయి.
అర్ధరాత్రి ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్న వారిలో లారీలు, టిప్పర్లు, కార్లు, క్యాబ్స్, ఆటోలు నడుపుతున్న వారే అధికమని.. ద్విచక్రవాహనదారులు తక్కువేనని తెలుస్తున్నది. మద్యం మత్తులోనే అధికంగా ఉల్లంఘనలకు పాల్పడటంతో పాటు వాహనాలను చాలా వేగంగా నడుపుతున్నట్లు నిఘా కెమెరాల్లో రికార్డు అవుతున్న దృశ్యాలను పరిశీలించిన పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా మాదాపూర్, గచ్చిబౌలి, మియాపూర్, సుచిత్రా జంక్షన్, శంషాబాద్ తదితర ప్రాంతాల్లో ఈ ఉల్లంఘనలు అధికంగా ఉంటున్నాయి. అయితే కొద్ది మందికి ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ఉన్నా భారీ వాహనాల భయంతో ఉల్లంఘిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తెలిసింది. ఇటీవల గచ్చిబౌలి చౌరస్తాలో రెడ్ సిగ్నల్ పడినా అది గమనించకుండా భారీ వాహనం దూసుకొచ్చి చౌరస్తాలో ఆగిన కారును ఢీ కొట్టడంతో ఐదుగురు మృతి చెందిన విషయం విదితమే. దీంతో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అర్ధరాత్రి ట్రాఫిక్ ఉల్లంఘనలపై ప్రధాన దృష్టి సారించారు. వెంటనే ఈ చలాన్లు పంపుతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ 15 వరకు దాదాపు 100 మందికి పైగా వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు చలాన్లు జారీ చేశారు.
పగలైనా రాత్రైనా నిబంధనల్లో ఎలాంటి మార్పులు ఉండవు. జంక్షన్లలో రెడ్సిగ్నల్ పడితే ఆగాల్సిందే. అంతేగాని ఎవరూ చూడడం లేదని దాటేస్తే నిఘా కెమెరాలు పట్టేస్తాయి. చిత్రాలను కంట్రోల్ రూంకు పంపిస్తాయి. దీంతో పోలీసులు చలాన్లు జారీ చేస్తారు. సమయం ఏదైనా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే అందరికి మంచిది. – డీసీపీ ఎస్ఎమ్ విజయకుమార్