హైదరాబాద్: హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Restrictions) విధించారు. సోమవారం సాయంత్రం ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్తోపాటు అంబర్పేటలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాహనాల దారి మళ్లింపులు, ఆంక్షలు ఉంటాయని పోలీసులు వెల్లడించారు.
సోమవారం సాయంత్రం ఉప్పల్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్ మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగనుంది. దీంతో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11.50 గంటల వరకు స్టేడియం పరిసర ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి.
చంగిచర్ల, బొడుప్పల్, పీర్జాదీగూడ వైపు నుంచి ఉప్పల్ వైపు వచ్చే వాహనాలను హెచ్ఎండీఏ భాగాయత్ నుంచి నాగోల్ వైపు, ఎల్బీనగర్ వైపు నుంచి వచ్చే వాహనాలను నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద నుంచి హెచ్ఎండీఏ లేఅవుట్ వైపు, తార్నాక నుంచి వచ్చే వాహనాలను హబ్సిగూడ నుంచి నాచారం, ఐఓసిఎల్ చెర్లపల్లి, స్ట్రీట్ నెం. 8, హబ్సిగూడ, మెట్రో పిల్లర్ 972 యు-టర్న్ ద్వారా ఉప్పల్ ఎక్స్ రోడ్ వైపు వాహనాలను మళ్లిస్తారు. రామంతాపూర్ నుంచి వచ్చే వాహనాలను స్ట్రీట్ నంబర్ 8 నుంచి హబ్సిగూడ వైపు మళ్లించనున్నారు.
ఇక సోమవారం సాయంత్రం 5.30 గంటలకు అంబర్పేట ఫ్లైఓవర్ను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించనున్నారు. 6 గంటలకు జీహెచ్ఎంసీ అంబర్పేట స్టేడియంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం అంబర్పేట మునిసిపల్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభలో కేంద్రమంత్రి ప్రసంగిస్తారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ ఉండనుంది. అందువల్ల వాహాన దారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని అధికారులు సూచించారు.