కార్వాన్, ఫిబ్రవరి 13: ప్రభుత్వం విధించిన ట్రాఫిక్ నిబంధనలు వాహనదారుల రక్షణ కోసమేనని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసం- 2024లో భాగంగా గుడిమల్కాపూర్లో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీపీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ట్రాఫిక్ కూడా తీవ్రంగా పెరిగిపోయిందన్నారు. నిబంధనలకు అనుగుణంగా వాహనాలు నడపాలని.. అప్పుడే ప్రమాదాలు నివారించగలమన్నారు. ప్రత్యేక అతిథిగా పాల్గొన్న ప్రముఖ సినీహీరో జొన్నలగడ్డ సిద్దు మాట్లాడుతూ..
వాహనచోదకలు కచ్చితంగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. తాను కాలేజీ విద్యార్థిగా ఉన్న సమయంలో రెండుసార్లు ప్రమాదానికి గురయ్యానని, ద్విచక్ర వాహనంపై హెల్మెట్ వల్ల ఒకసారి, కారు ప్రయాణంలో సీట్ బెల్ట్ పెట్టుకోవడంతో మరోసారి ప్రమాదం నుంచి బయటపడ్డానని తెలిపారు. ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించడం వల్ల ట్రాఫిక్ సమస్యతో పాటు రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో యువత, డ్రైవర్లు, రోటరీ క్లబ్ అధ్యక్షుడు శంకర్ రెడ్డి, పోలీస్ ఉన్నతాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.