వేగం మీరితే పట్టేస్తుంది
రోడ్డు ప్రమాదాల నివారణకు
ట్రాఫిక్ పోలీసుల కసరత్తు
నగర రహదారుల్లో ఏడెనిమిది చోట్ల
బిగించేందుకు సన్నాహాలు
సిటీబ్యూరో, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): నగరంలో రోడ్డు ప్రమాదాల నివారణకు బహుముఖ ప్రణాళికలు అమలు చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు వేగ నియంత్రణకు 24 గంటలూ పనిచేసే ఆటోమెటిక్ స్పీడ్గన్లను ఏర్పాటు చేయనున్నారు. రాత్రి సమయాలలో ఖాళీగా ఉండే రోడ్లపై హైస్పీడ్ బైక్లు, కార్లతో అతివేగంగా యువత వాహనాలను నడుపుతూ ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారు. ఇలాంటి వాటిని కట్టడి చేసేందుకు ఈ కెమెరాలు ఉపయోగపడనున్నాయి. మొదటి దఫాలో ఎనిమిది చోట్ల ఈ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆ తర్వాత క్రమక్రమంగా నగర వ్యాప్తంగా వీటిని విస్తరించనున్నారు.
రోడ్డుకు అటూ.. ఇటు!
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, సికింద్రాబాద్, మెహిదీపట్నం, చాంద్రాయణగుట్ట, మెట్టుగూడ తదితర విశాలమైన రోడ్లలో వాహనాల వేగం ఎక్కువగా ఉంటుంది. పగటి వేళల్లో వాహనాల రద్దీ ఉండడంతో వేగ పరిమితిని మించి తక్కువ స్థాయిలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. రాత్రి వేళల్లో మాత్రం విశాలమైన రోడ్లపై వాహనాల వేగం నిర్ణీత పరిమితికి మించి ఉంటుంది. నగరంలో వాహనాల వేగ పరిమితిని పెంచారు. దీన్ని ఆధారంగా చేసుకొని వేగ నియంత్రణను ఈ కెమెరాలకు ఖరారు చేస్తారు.
డివైడర్లు ఉండి, పాదచారులు దాటేందుకు వీలు లేని రోడ్లలో వాహనాల వేగం కారుకు 60 కి.మీ.(గంటకు), బైక్కు 50, భారీ వాహనాలకు 40గా నిర్ణయించారు. ఆయా దారుల్లో అటు ఇటూ వచ్చిపోయే వాహనాలను ఈ కెమెరాలు రికార్డు చేసి వాహనాల వేగాన్ని లెక్కిస్తాయి. ప్రస్తుతం ఉన్న స్పీడ్ గన్స్ మ్యాన్వల్గా పనిచేస్తున్నాయి. సిబ్బంది రోడ్లపై ఆ పరికరాలను పెట్టుకొని వచ్చిపోయే వాహనాల వేగంపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. కానీ ఈ కొత్త కెమెరాలకు సిబ్బంది అవసరం లేదు. 24 గంటలు ఆటోమెటిక్గా పనిచేస్తాయి. రాత్రి వేళల్లో ఈ కెమెరాలు వాహనాల వేగాన్ని గుర్తిస్తాయి. అతివేగంగా వెళ్తున్న వాహనం ఫొటో తీసి క్షణాలలో జరిమానాకు సంబంధించిన మెసేజ్ను పంపిస్తుంది. మితిమీరిన వేగంతో వెళ్తుంటే ఈ కెమెరా నుంచి కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్కు హెచ్చరిక కూడా వస్తుంది.
ప్రమాదాలకు కారణం అతివేగమే
నిర్లక్ష్యంగా నడపడంతో, అతివేగం వల్లే నగరంలో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాలు తగ్గాలంటే ట్రాఫిక్ నిబంధనలు పక్కాగా అమలు కావాలి. అందుకే వాటిని ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇందులో భాగంగానే ఎవరెంత స్పీడుతో ప్రయాణిస్తున్నారో గుర్తించేందుకు ఆయా ప్రధాన రహదారుల్లో స్పీడ్ కెమెరాలను అందుబాటులోకి తీసుకురానున్నాం. అవి ఆటోమేటిక్గా పనిచేస్తూ ఉంటాయి. ఈ కెమెరాలు రాత్రి వేళలో కూడా స్పష్టంగా వాహనాల వేగాన్ని నిర్ధారిస్తాయి. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి అక్కడ వీటిని ఏర్పాటు చేస్తాం. తద్వారా యాక్సిడెంట్లను నివారించగలుగుతాం.
– ట్రాఫిక్ జాయింట్ సీపీ, ఏవీ రంగనాథ్