సిటీబ్యూరో, మార్చి 1 (నమస్తే తెలంగాణ): ట్రాఫిక్ నియంత్రణ కంటే ఉల్లంఘనలపైనే ట్రాఫిక్ పోలీసులు ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. రోజు వారీ టార్గెట్ల కోసం ఇష్టానుసారంగా చలాన్లు విధిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో వారం రోజుల్లోనే రాంగ్ సైడ్ డ్రైవింగ్కు 10వేల కేసులు నమోదు చేశారు. ప్రతి రోజూ 11 ట్రాఫిక్ పోలీస్స్టేషన్ల పరిధిలో 1,440 వరకు చలాన్లు విధిస్తున్నారు. ట్రాఫిక్ రద్దీని తప్పించుకోవడం కోసం కొందరు వాహనదారులు రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తుండడం ఆందోళన కలిగిస్తున్నది. పోలీసులు ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై కొంత దృష్టి సారిస్తే ఉల్లంఘనలు తగ్గే అవకాశాలుంటాయి. కాగా, గత వారం నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్లో మల్కాజిగిరి 299, సైబరాబాద్లో 280 పోలీస్ కమిషనరేట్ల పరిధిలో కేసులు నమోదయ్యాయి. ఇందులో 24 మందికి బీఏసీ లెవల్స్ 301 నుంచి 550 ఎంజీ వరకు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. పట్టుబడ్డ వారిని కోర్టులో హాజరుపరచగా, అందులో 19 మందికి జరిమానా, జైలు శిక్షలు పడ్డాయని, 10 మందికి జరిమానా, సామాజిక సేవ, మిగతా వారికి జరిమానాలు విధిస్తూ కోర్టులు తీర్పు చెప్పాయని జంట కమిషనరేట్ల ట్రాఫిక్ పోలీసు అధికారులు వెల్లడించారు.
గత వారం మల్కాజిగిరి కమిషనరేట్లో నమోదైన ఉల్లంఘనలు
ఉల్లంఘన : కేసుల సంఖ్య
రాంగ్సైడ్ డ్రైవింగ్ : 10,086
రోడ్లపై వాహనాల రాకపోకలకు అడ్డంకి : 8,178
సెల్ఫోన్ డ్రైవింగ్ : 1,015
ట్రిపుల్ రైడింగ్ : 1, 824
అతివేగం : 1,401
సిగ్నల్ జంప్ : 2,648