సిటీబ్యూరో, జూన్ 19(నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫార్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (హెచ్ సిటీ) ప్రాజెక్టులో భాగంగా బంజారాహిల్స్, జూబ్లిహిల్స్ ట్రాఫిక్ పీఎస్ల పరిధిలో స్టీల్ ఫ్లైఓవర్, అండర్పాస్ నిర్మాణ పనులు జరుగుతున్నాయని ఈ నేపథ్యంలో కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉన్న అన్నిరోడ్లలో ఈనెల 21న వన్వే ట్రయల్ రన్ నిర్వహిస్తున్నామని సిటీ ట్రాఫిక్ పోలీస్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ తెలిపారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వన్వే ట్రయల్ రన్ నిర్వహిస్తామని, ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేసిన సైన్బోర్డుల ఆధారంగాఎడమ, కుడి లేన్లలోకి మారడానికి లేన్చేంజర్స్ ఉపయోగించాలని ఆయన కోరారు.
ఎన్ఎఫ్సీఎల్ నుంచి కేబుల్ బ్రిడ్జ్ వైపు వెళ్లే వాహనదారులు ఎన్టీఆర్ భవన్ వద్ద ఎడమ మలుపు తీసుకుని బసవతారకం హాస్పిటల్ నుంచి కేబుల్ బ్రిడ్జి వైపు వెళ్లాలని, యూసుఫ్గూడ, శ్రీనగర్కాలనీ వైపు నుంచి మాదాపూర్ వైపు వెళ్లే వాహనదారులు ఇందిరానగర్గడ్డ రోడ్ మీదుగా వెంకటగిరి జంక్షన్ వైపు వెళ్లాలని, అన్నపూర్ణ స్టూడియో బైలైన్ మీదుగా షేక్పేట వైపు వెళ్లవచ్చని ఆయన తెలిపారు. ఐటీసీ కోహినూర్, కేబుల్ బ్రిడ్జ్ నుంచి పంజాగుట్ట వైపు వెళ్లే వాహనదారులు రోడ్ నం.60, 67 మీదుగా ప్రయాణించి పంజాగుట్ట వైపు వెళ్లవచ్చని చెప్పారు. ఈ మార్గాల్లో ఎక్కడా యూ టర్న్లు అనుమతించబడవని, ఎగ్జిట్ పా యింట్లను పరిశీలించాలని జోయల్ డేవిస్ సూచించారు.