హైదరాబాద్: నిత్యం ట్రాఫిక్ జామ్తో (Traffic) హైదరాబాద్ నగరవాసులు అవస్థలు పడుతున్నారు. గంటల కొద్దీ ట్రాఫిక్ స్తంభించిపోతుండటంతో వాహనదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. విజిబుల్ పోలీసింగ్ లేకపోవడంతోనే ఈ సమస్య తీవ్రమవుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రభుత్వ, అధికార యంత్రాంగం ట్రాఫిక్ సమస్యపై మల్లగుల్లాలు పడాల్సి వస్తున్నది. గత నెల రోజుల వ్యవధిలోనే సీఎం రేవంత్రెడ్డి రెండు సార్లు నగర ట్రాఫిక్ సమస్యపై సమీక్ష నిర్వహించాల్సి వచ్చింది. కానీ సమస్య మాత్రం కొంతమేర కూడా పరిష్కారం కాలేదు.
నగరంలో ట్రాఫిక్ సమస్య తీవ్రం కావడంతో పాటు పరిష్కారం కాకపోవడానికి పలు ప్రధాన కారణాలు ఉన్నాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇందులో ప్రధానంగా విజిబుల్ పోలీసింగ్ అనేది చాలా తగ్గిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పీక్ అవర్స్లో కొన్నిచోట్ల కనిపించినా… ఆ తర్వాత లేకపోవడంతో సాధారణ సమయాల్లోనూ ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. నగరంలో ప్రధానంగా కొన్నిచోట్ల ట్రాఫిక్ జామ్ తీవ్రమై… దాని ప్రభావం చుట్టూ కిలోమీటర్ల మేర కనిపిస్తున్నది. దీనిపై సంబంధిత పోలీసు అధికారుల ఫోకస్ ఉండటం లేదనే విమర్శలు ఉన్నాయి. తొలుత స్వల్పకాలిక పరిష్కారాలపై దృష్టిసారించి… ఆతర్వాత దీర్ఘకాలిక చర్యలకు ఉపక్రమిస్తే వాహనదారులకు కొంతమేర ఊరట కలుగుతుందని పలువురు సూచిస్తున్నారు.
నగరంలో ట్రాఫిక్ సమస్య వాహనదారులను వెంటాడుతున్నది. నగరవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్లతో వాహనదారులు విసిగిపోతున్నారు. సమస్య పరిష్కారానికి అధికార యంత్రాంగంలోని ఉన్నతాధికారులు మల్లగుల్లాలు పడుతున్నా… క్షేత్రస్థాయిలో పరిష్కార మార్గాలు అమలు కావడం లేదు. సమస్య తీవ్రత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వరకు వెళ్లింది. ఈ నేపథ్యంలో కొన్నిరోజుల కిందట సీఎం రేవంత్ ట్రాఫిక్ సమస్యపై ఆరా తీశారు. అసలు ట్రాఫిక్ జామ్లు ఎందుకు అవుతున్నాయి? పరిష్కారాన్ని చూడండి.. అని పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఇందుకు అనుగుణంగా ఇటీవల బంజారాహిల్స్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి అధికారులతో చర్చించారు. తదనంతరం పలు రకాల చర్యలు అమలులో కనిపించాయి. సైబరాబాద్ పరిధిలో భారీ వాహనాల రాకపోకలపై నిషేధ సమయాన్ని పొడిగించారు. ఉదయం ఏడున్నర నుంచి పదిన్నర వరకు ఉన్న సమయాన్ని పదకొండున్నర వరకు… సాయంత్రం నాలుగు నుంచి రాత్రి పది వరకు ఉంటే.. పదిన్నర వరకు పొడిగించారు. దీంతో పాటు ఫుట్పాత్ ఆక్రమణలు తొలగించడం వల్ల సమస్య కొంతమేరకు తీరుతుందని ఆ మేరకు చర్యలు చేపట్టారు. అయినా సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కారం కాలేదు.