హైదరాబాద్, ఫిబ్రవరి 26 : అంతర్జాతీయ న్యాయ సంస్థలు గాజాలోని హింసాత్మక ఘటనలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న సమయంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇజ్రాయేల్ (Israeli)లో పర్యటించడాన్ని తెలంగాణ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు డా. రేఖ బోయలపల్లి (Boyalapalli Rekha) తప్పుపట్టారు. ఐసీసీ అరెస్ట్ వారెంట్లు ఎదుర్కొంటున్న నాయకుడితో ప్రధాని భేటీ కావడం అత్యంత బాధ్యతారాహిత్యపూరిత చర్య అని ఆమె తీవ్రంగా మండిపడ్డారు.
భారతదేశం చరిత్రపరంగా ఎప్పుడూ శాంతి, న్యాయం, పీడిత ప్రజల హక్కులకు అండగా నిలిచిన దేశం. తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ నుంచి ప్రారంభమైన భారత విదేశాంగ విధానం నైతిక ధైర్యం, తటస్థత, మానవ హక్కుల పరిరక్షణకు ప్రతీకగా నిలిచింది. కానీ నేడు నరేంద్ర మోడీ పాలనలో మన విదేశాంగ విధానం వ్యక్తిగత ప్రచారం, రాజకీయ లబ్ది కోసం దుర్వినియోగం అవుతోందని రేఖ ధ్వజమెత్తారు.
ఇజ్రాయేల్ పర్యటనలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు బెంజాబిన్ నెతన్యాహుతో ప్రధాని నరేంద్ర మోడీ భేటీని డా. రేఖ బోయలపల్లి ఖండించారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. “ప్రపంచం న్యాయం కోసం నిలబడుతున్న సమయంలో, మోదీ ప్రభుత్వం మాత్రం న్యాయం పట్ల గౌరవం చూపకుండా, కేవలం ఫోటో-ఆప్స్, వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకోవడం కోసం దేశ గౌరవాన్ని తాకట్టు పెడుతోంది. ఇది భారతదేశ విదేశాంగ చరిత్రలో ఒక ప్రమాదకర మలుపు” అని పేర్కొన్నారు. ఈ నిర్ణయం కేవలం ఒక విదేశీ పర్యటన కాదు. ఇది గల్ఫ్ దేశాలతో ఉన్న కీలక ఇంధన సంబంధాలు, కోట్లాది భారతీయ కార్మికుల ఉపాధి, భారతదేశ ఆర్థిక ప్రయోజనాలను ప్రమాదంలో పడేసే అవకాశం ఉందని ఆమె హెచ్చరించారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి దేశ ప్రయోజనాల కంటే ప్రచార రాజకీయాలు ముఖ్యమైపోయాయని నెతన్యాహుతో ప్రధాని భేటీ ద్వారా స్పష్టమైందని రేఖ విమర్శించారు. “భారతదేశం ఎప్పుడూ న్యాయం, శాంతి, మానవత్వం పక్షాన నిలిచిన దేశం. కానీ నేడు మోదీ నాయకత్వంలో, అదే భారతదేశం ప్రపంచ వేదికపై తన నైతిక స్థిరత్వాన్ని కోల్పోయే ప్రమాదంలో ఉంది. ఇది దేశ గౌరవానికి తీవ్ర నష్టం,” అని రేఖ బోయలపల్లి పేర్కొన్నారు. భారతదేశ విదేశాంగ విధానం బీజేపీ ప్రచారం కోసం కాకుండా దేశ గౌరవం, దేశ ప్రయోజనాలు, ప్రపంచ శాంతికి తోడ్పడేలా ఉండాలని మోడీకి ఆమె హితవు పలికారు. మోడీ ప్రభుత్వం వ్యక్తిగత ప్రచార రాజకీయాలను పక్కన పెట్టి, భారతదేశం చారిత్రక విలువలను కాపాడాలని, న్యాయం, శాంతి పక్షాన నిలబడాలని డా. రేఖ బోయలపల్లి డిమాండ్ చేశారు.