యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 22 : సీఎం కేసీఆర్ యాదగిరిగుట్ట ఆలయాన్ని పునర్నిర్మించడమే కాకుండా పరిసర ప్రాంతాల్లో పర్యాటకాభివృద్ధికి అనేక చర్యలు చేపట్టారు. రహదారి విస్తరణతోపాటు అభయారణ్యాలు నిర్మించారు. రాయగిరి స్వాగత తోరణం నుంచి 5 కిలోమీటర్ల మేర నాలుగు లేన్ల రోడ్డుగా మార్చారు. రోడ్డుకు ఇరువైపులా సుమారు 84 వేల వివిధ రకాల పూల మొక్కలతోపాటు సుగంధ ద్రవ్యాల మొక్కలు సుమారు 13 వేలు నాటారు. ప్రస్తుతం మొక్కలు ఏపుగా పెరిగి భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. రాయగిరి చెరువును భక్తులు తనివితీరా వీక్షించేందుకు వైటీడీఏ నాలుగుచోట్ల వాటర్ ఫౌంటెయిన్లను నిర్మించింది.
చెరువులో బోటింగ్ సిద్ధం చేసింది. చెరువు అలుగుపోసే ప్రాంతంలో రెండెకరాల్లో శిల్పారామం అద్భుతంగా నిర్మించారు. రాయగిరి చెరువు దగ్గర రాయగిరి-1 రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోని 140 ఎకరాల్లో ఆంజనేయ అరణ్యం ఏర్పాటు చేయగా, 2015 నుంచి ఇప్పటి వరకు నాటిన 44,000 మొక్కలు దట్టమైన అడవిని తలపిస్తున్నాయి. రాయగిరి-2 రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోని 240 ఎకరాల్లో ఏర్పాటు చేసిన నరసింహ అరణ్యంలో 2017 నుంచి 22,000 మొక్కలు నాటారు.
అడవిలోనే తీర్చిదిద్దిన ఈ పార్కులు పిల్లలనే కాదు, పెద్దలనూ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. సెల్ఫీ పాయింట్లు, ఎంట్రీ ప్ల్లాజా, నీటితో కళకళలాడే చెక్డ్యామ్లు, వాకింగ్ ట్రాక్లు అద్భుతంగా దర్శనమిస్తున్నాయి. నరసింహ అరణ్యంలో జింకలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. రాయగిరి పట్టణంలో 16వ శతాబ్దం నాటి కోనేరు(మెట్లబావి)ను అద్భుతంగా తీర్చిదిద్దారు. చతురస్రాకారంలో పిరమిడ్లా కనిపిస్తున్న ఈ బావి పర్యాటకులను ఎంతో ఆకట్టుకుంటున్నది.
భువనగిరిలోని ఖిలా ట్రెక్కింగ్ ప్యారడైజ్గా వెలుగొందింది. క్రీ.శ.1123లో నిర్మించిన కోట చారిత్రక సంపదను తిలకించేందుకు భక్తులు తరలివస్తున్నారు. యాదగిరిగుట్ట స్వామివారి కొండకు పశ్చిమ ప్రాంతంలో 848.13 ఎకరాల్లో టెంపుల్ సిటీని నిర్మించారు. సువిశాల ఫోర్లైన్ రోడ్లు, హెలిప్యాడ్, చూడచక్కని సర్కిళ్లు, విద్యుత్, నీటి సౌకర్యాలతో తీర్చిదిద్దారు. దాతల సహకారంతో ప్రత్యేకమైన విల్లాలు ఏర్పాటు చేసేందుకు స్థలాన్ని కేటాయించారు. కొండపైన అద్భుతమైన వైటీడీఏ కార్యాలయాన్ని నిర్మించారు.