మాదాపూర్, డిసెంబర్ 22 : తెలంగాణ ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించే అంశాలలో టూరిజం ప్రమోషన్ ఒకటని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మాదాపూర్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో శుక్రవారం ఏర్పాటు చేసిన పెటెక్స్ ఇండియా, కిడ్స్ ఫెయిర్ – 2023 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరై హైటెక్స్ హెడ్ టీజీ శ్రీకాంత్తో పాటు నిర్వాహకులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణకు గొప్ప సంస్కృతి వారసత్వం ఉన్నదని అన్నారు.
తెలంగాణలో పర్యాటకాన్ని మరింత ప్రోత్సహించే దిశగా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలో నివాసముంటున్న ప్రతి ఒక్కరూ తెలంగాణ టూరిజంకు బ్రాండ్ అంబాసిడర్గా ఉంటూ ప్రోత్సహించాలన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో తెలంగాణ అత్యుత్తమ రాష్ట్రంగా నిలిచిందన్నారు. అనంతరం హైటెక్స్ హెడ్ టీజీ శ్రీకాంత్ మాట్లాడుతూ కిడ్స్ ఫెయిర్ నాలుగు కీలక విభాగాలైన విద్య, జీవనశైలి, పోశకాహరం, అభిరుచులు వంటి వాటిలో ఒక శక్తివంతమైన ఉత్పత్తులు, సేవలను ప్రదర్శిస్తుందన్నారు. పెటెక్స్ అనేది కేవలం ప్రదర్శన మాత్రమే కాదని పెంపుడు జంతువుల సంక్షేమం కొరకు లోతుగా శ్రద్ధ వహించే ఎక్స్ పో అని తెలిపారు. మంత్రి జూపల్లి కృష్ణారావు ఎక్స్పోకు కుటుంబ సమేతంగా విచ్చేసి ఆయా స్టాల్స్ను సందర్శించారు.
హైటెక్స్లో ఏర్పాటు చేసిన పెటెక్స్ ఎక్స్ పోలో భాగంగా పలు రకాల అలంకార చేపలు దర్శనమిచ్చాయి. ఇందులో సిల్వర్ అరోవానా, ప్లవర్ హర్న్, కోయి ఫిష్, జెయింట్ గౌరామి, ఎలిగేటర్ గార్, టైగర్ ఆస్కార్, ఆల్బినో ఆస్కార్, రెడ్ పారెట్ షిప్, ఫవర్ ఫిష్, కిస్సింగ్ గౌరామి, 4 రకాల సిచ్లిడ్స్, స్కాట్స్ ఫిష్ వంటి 50 రకాలకు పైగా అలంకార చేపలతో పాటు పలు జాతులకు చెందిన శునకాలు ఈ ప్రదర్శనలో కొలువుదీరగా టైగర్ షార్క్, ట్విన్ ఫిన్ బార్బ్, రెడ్ క్యాప్ గోల్డ్ ఫిష్, ఒరాండా గోల్డ్ ఫిష్, పాకు ఫిష్, రోజీ బార్బ్, టైగర్ బార్బ్, సకర్ క్యాట్ ఫిష్, 5 రకాలకు చెందిన టెట్రాస్, చన్నా ఫిష్, ఎండ్రకాయలు, ఎస్కే గోల్డ్, మోలీస్ 3 రకాలు, సిల్వర్ డాలర్స్, స్టింగ్రే ఫిష్, స్టార్ ఫిష్ రెడ్, బ్లాక్ గోస్ట్ ఫిష్, ఆరోవానో ఫిష్లు ఉన్నాయి. వీటి ధర ఒక్కోటి రూ.లక్షా 45వేలు ఉంటుందని, ఇందులో అరోవానా చేపలు చాలా అరుదుగా కనిపిస్తుంటాయని నిర్వాహకులు తెలిపారు. వీటిని చూసేందుకు నగర నలు మూలల నుంచి పలువురు విచ్చేసి ప్రదర్శనలో ఏర్పాటు చేసిన జంతువుల వద్ద సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు.
బెంగళూరుకు చెందిన సుభద్ర చెరుకూరిచే శనివారం ఉదయం 11 గంటలకు థెరపీ డాగ్స్ వర్క్ షాపుతో పాటు డెమోను నిర్వహించనున్నారు. ఇందులో పెంపుడు జంతువులు, మనోరోగ వైద్యులు, మనస్తత్వ శాస్త్ర విద్యార్థులు, డాగ్ ట్రైనర్స్, ఆందోళన మానసిక ఆరోగ్యంపై దృష్టి సారించే మానసిక ఆరోగ్య సంబంధిత సంస్థలపై చర్చలు జరగడంతో పాటు షెల్టర్ కుక్క పిల్లలతో యోగా, విన్యాసాలను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సాయంత్రం 4 గంటలకు 1200 మంది పిల్లలతో కిడ్స్ రన్ కొనసాగుతుందని ఇందులో పిల్లల తలిదండ్రులు సైతం పాల్గొనవచ్చనితెలిపారు. ఖగోళ త్రీడీ థియేటర్, డైనోసార్ మూవీ ఎక్స్ట్రా వాగాంజా, మిరుమిట్లు గొలిపే వర్క్షాపులను అందుబాటులో ఉంచనున్నారు.