Hyderabad |సిటీబ్యూరో, మార్చి 5 (నమస్తే తెలంగాణ): నగర శివారు ప్రాంతాల్లో ఆధునిక మౌలిక వసతులతో ఎలాంటి వివాదాలు లేని ప్రభుత్వ స్థలంలో లేఅవుట్లను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అభివృద్ధి చేస్తోంది. పీర్జాదిగూడ పరిధిలోని మేడిపల్లిలోని 55 ఎకరాల స్థలంలో భారీ లేఅవుట్ను అభివృద్ధి చేసి, ఆన్లైన్లో ప్లాట్లను విక్రయించేందుకు సిద్ధం చేశారు. దీనికి సంబంధించిన ఫ్రీబిడ్ సమావేశాన్ని చేపట్టి ఔత్సాహిక కొనుగోలుదారులకు వివరాలను అధికారులు వెల్లడించారు.
ప్లాట్ల ఆన్లైన్ విక్రయాన్ని సోమవారం ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో నిర్వహిస్తున్నామని అధికారులు తెలిపారు. మొత్తం 50 ప్లాట్లను విక్రయించనున్నామని, ఇందులో చదరపు గజానికి నిర్ణయించిన కనీస మద్దతు ధర రూ.32000/- కాగా, వేలంలో పెంచాల్సిన కనీస ధర రూ.500/-గా నిర్ణయించామని తెలిపారు. ఆన్లైన్ వేలం ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించేందుకు వేలం నిర్వహణను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్టీసీకి అప్పగించామని, రిజిస్ట్రేషన్ నుంచి మొదలు అన్ని వివరాలు ఆన్లైన్లో అందుబాటులో ఉంచామన్నారు. ఔటర్ రింగు రోడ్డు లోపల అత్యంత కీలకమైన హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారికి సమీపంలోనే ఉండడంతో కొనుగోలుదారుల నుంచి అనూహ్య స్పందన కనిపిస్తోందని తెలిపారు.