సిటీబ్యూరో, సెప్టెంబర్ 7(నమస్తే తెలంగాణ): ‘డబ్ల్యూడబ్ల్య్లూఈ’.. ఈ పేరు వింటే చాలు చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ పూనకాలతో ఊగిపోతారు. అదొక రసవత్తరమైన ఫైట్.. క్షణక్షణం ఉత్కంఠ.. ఎవ్వరు గెలుస్తారో చెప్పలేని పరిస్థితి ఉంటుంది. ఒకరికి ఒకరు రక్తమోడేలా కొట్టుకుంటారు. రింగ్లో పల్టీలు కొడుతూ దూకుతారు. నువ్వా నేనా అన్నట్టుగా కలబడుతారు. గాయాలన్నైనా లెక్క చేయరు. ఓ దశలో వీక్షకులకు గుండెలు అరచేతుల్లో పెట్టుకునేంత టెన్షన్ ఉంటుంది. అయితే ఇటాంటి ఫైట్ ఇన్నాళ్లు టీవీల్లోనే చూసి గంతులేసేవాళ్లం. కానీ ఇప్పుడు ఇటువంటి భీకర పోరును ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం నగరవాసులకు దక్కింది. అంతర్జాతీయ సూపర్ఫైట్ ‘డబ్ల్యూడబ్ల్యూఈ’కి మన హైదరాబాద్ ఆతిథ్యమిచ్చింది.
శుక్రవారం గచ్చిబౌలి స్టేడియం వేదికగా తొలిసారి వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ (డబ్లూడబ్ల్యూఈ) పోటీ జరగబోతున్నది. ఈ సూపర్ ఫైట్లో 28 మంది అంతర్జాతీయ చాంపియన్స్ పోటీ పడనున్నారు. హైదరాబాద్ వేదికగా తొలిసారి వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ (డబ్లూడబ్ల్యూఈ) జరగనుంది. ఈ ఈవెంట్లో ప్రపంచ హెవీవెయిట్ చాంపియన్ సేథ్ ఫ్రీకిన్ రోలిన్స్, ఉమెన్ ప్రపంచ చాంపియన్ రియా రిప్లే, డబ్ల్యూడబ్ల్యూఈ టాగ్ టీం చాంపియన్ సమీజైన్ తదితర సూపర్ స్టార్స్ పోటీపడుతున్నారు. కాగా, ప్రపంచంలోనే మొట్ట మొదటిసారిగా ఈ-రేసింగ్ పోటీలు మన హైదరాబాద్ వేదికగా జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకమైన డబ్ల్యూడబ్ల్యూఈ పోటీలకు హైదరాబాద్ ఆతిథ్యమిచ్చింది. హైదరాబాద్ విశ్వనగరంగా ప్రపంచాన్ని ఆకట్టుకుంటుండటం విశేషం.