సిటీబ్యూరో, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): ఇండియన్ రేసింగ్ లీగ్ తుది పోటీలకు అంతా సిద్ధమైంది. దేశీయంగా జరుగుతున్న ఫార్ములా కార్ రేసింగ్ పోటీలు మొట్ట మొదటిసారిగా హైదరాబాద్ వేదికగా నిర్వహిస్తుండటంతో ఈ పోటీలు ఎంతో ఉత్సుకతను రేకిస్తున్నాయి.శనివారం లీగ్లో భాగంగా ప్రాక్టీస్ రేసింగ్ లీగ్ను నిర్వహించారు. సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైన ఈ పోటీల్లో పలు జట్లు పాల్గొన్నాయి. ప్రాక్టీసు రేసులు ఉదయం నుంచే జరుగుతాయని చెప్పినా, సాంకేతిక కారణాలతో మధ్యాహ్నం తర్వాత నిర్వహించారు. ఈ సందర్బంగా నిర్వహించిన ప్రాక్టీస్ రేస్లో బెంగళూరు స్పీడ్స్టర్స్ ద్వయం ఆలివర్ వెబ్, అన్షుల్ గాంధీలు 1.15.982 సెకన్లలో రేసింగ్ టేబుల్లో అగ్రస్థానంలో నిలిచారు.
ఆ తర్వాత స్థానంలో కొచ్చిన్ జంట అయిన నిఖిల్ బోహ్రా, అలిస్టర్ యోంగ్లు ఉండగా, స్పీడ్ డెమన్స్ ఢిల్లీ తరఫున షాహాన్ అలీ మోహ్సిన్, ఆకాష్ గౌడలు మూడో స్థానంలో నిలిచారు. కాగా హైదరాబాద్ నగరానికి చెందిన టీమ్ హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ ఈ పోటీలో చాంపియన్ షిప్గా నిలిచేందుకు రేపు జరిగే ఫైనల్ పోరులో రయ్ రయ్ మంటూ దూసుకెళ్లనుంది. ఆదివారం ఉదయం నుంచి క్వాలిఫైయింగ్ సెషన్లు, 2 స్ప్రింట్ రేస్లు, షెడ్యూలు ప్రకారం ఫీచర్ రేస్లు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.
ట్రాక్పై రెండు చోట్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు
హుస్సేన్సాగర్ తీరంలో మొట్ట మొదటి సారిగా నిర్మించిన ఫార్ములా కార్ రేసింగ్ ట్రాక్లో గత నెల 19,20 తేదీల్లో ఇండియన్ రేసింగ్ లీగ్ పోటీలు జరిగాయి. గత అనుభవాలను పరిగణనలోకి తీసుకున్న నిర్వాహకులు రెండోసారి నిర్వహిస్తున్న పోటీల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా రేసింగ్ ట్రాక్పై ఒకవైపు నుంచి మరో వైపు వెళ్లేందుకు వీలుగా రెండు చోట్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు నిర్మించారు.
ఐమ్యాక్స్ నుంచి ఖైరతాబాద్ గణేశ్ కూడలికి వెళ్లే మార్గంలో, ఇందిరాగాంధీ రోటరీ నుంచి ఐమ్యాక్స్ వచ్చే మార్గంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జీలను ఏర్పాటు చేశారు. గతంలో ట్రాక్ నిర్మాణంపై రేసింగ్ డ్రైవర్లు చేసిన ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకొని వాటిని సరిచేశారు. ఫిబ్రవరి 11న అంతర్జాతీయ స్థాయిలో జరిగే ఫార్ములా -ఈ రేసింగ్ పోటీలకు ట్రాక్ను సిద్ధం చేశారు.