ప్రీ నెటల్ యోగాతో కోతకు కోత
తొలి కాన్పు సిజేరియన్ అయినా రెండోసారి నార్మల్..
సిటీబ్యూరో, మార్చి 29 : ప్రీ నెటల్ యోగాతో కోతకు కోత పెట్టవచ్చంటున్నారు వేమన యోగా రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ వైద్యులు. అమీర్పేటలోని ప్రకృతి చికిత్సాలయంలోని వేమన యోగ రీసర్చ్ ఇనిస్టిట్యూట్లో గర్భిణులకు ప్రత్యేక శిక్షణ కల్పిస్తున్నారు. ఐదు నెలలు నిండిన తరువాతే వైద్యుల సూచన మేరకు ప్రి-నెటల్ యోగా శిక్షణతో 90శాతం సాధారణ ప్రసవం జరుగుతుంది. తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉంటారు. గర్భిణులకు ముద్రలు, బంధాలు, ఆసనాలు, ధ్యానం తదితర అంశాలతో కూడిన శిక్షణ ఇవ్వడం వల్ల వారిలో మానసిక ఒత్తిడి తగ్గుతుంది. బంధాల వల్ల థైరాయిడ్ నియంత్రణ, మూలాధార చక్రం సంకోచ, వ్యాకోచాలు సులువుగా జరుగుతాయి. ఇక ఆసనాల ద్వారా గర్భసంచి కండరాలు రిలాక్స్ అయ్యి సుఖ ప్రసవం జరుగుతుంది. ధ్యానం వల్ల బ్రీథింగ్ ఎక్సర్సైజ్ జరుగుతుంది. మొత్తానికి ఈ ప్రి-నెటల్ యోగాతో గర్భిణుల్లో కండరాలు సంకోచ, వ్యాకోచాలు జరిగి సాధారణ ప్రసవం జరిగేందుకు దోహదపడుతుంది. ఈ ప్రి-నెటల్ యోగాకు కార్పొరేట్ హాస్పిటల్స్లో వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. కానీ ప్రభుత్వ ప్రకృతి చికిత్సాలయంలోని వేమన యోగా రీసెర్చ్ ఇనిస్టిట్యూట్లో నెలకు కేవలం రూ.300తో ప్రి-నెటల్ యోగా శిక్షణ ఇస్తారు.
నగరానికి చెందిన కె.స్వాతి(32)కి..
మొదటి ప్రసవం సిజేరియన్ జరిగింది. సి-సెక్షన్ ప్రసవంతో ఆమె కొంత అనారోగ్యానికి గురికాక తప్పలేదు. ఏడేండ్ల తరువాత స్వాతి రెండోసారి గర్భం దాల్చింది. అయితే ఈసారి సిజేరియన్ కాకుండా సాధారణ ప్రసవం కావాలని కోరుకున్నది. కానీ వైద్యులు తొలి కాన్పు సెక్షన్తో జరిగిన తరువాత రెండోసారి సాధారణ ప్రసవం కష్టమని స్పష్టం చేశారు. బంధువుల సూచన మేరకు స్వాతి అమీర్పేట ప్రకృతి చికిత్సాలయంలోని వేమన యోగా రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ను ఆశ్రయించింది. యోగా లెక్చరర్ వి.సాయిరామ్ ఆమె మెడికల్ హిస్టరీని పరిశీలించి ప్రీ-నెటల్ యోగా చేయాల్సిందిగా సూచించారు. 35 వారాలు నిండిన తరువాత స్వాతికి నాలుగు వారాల పాటు ప్రీ-నెటల్ యోగాఆసనాలతో శిక్షణ అందించారు. ఈనెల మొదటి వారంలో స్వాతి సాధారణ ప్రసవంతో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.
ఈ సందర్భంగా ఆమె యోగా రీసర్చ్ సెంటర్ వైద్యులకు కృతజ్ఞతలు తెలిపింది.