సిటీబ్యూరో, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో భూముల ధరలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఇతర మెట్రో నగరాల కంటే హైదరాబాద్లో ఇండ్ల ధరలు ఎక్కువగా ఉన్నాయంటే.. రియల్ రంగంలో డిమాండ్ ఉండటమే కారణమని మార్కెట్ పరిశీలకులు చెబుతున్నారు. 2021 నాలుగో త్రైమాసికానికి సంబంధించి దేశంలోని ఎనిమిది ప్రధాన మెట్రో నగరాల్లో ‘ప్రాప్ టైగర్ డాట్కామ్’ సంస్థ నిర్వహించిన సర్వే ఆధారంగా రియల్ ఇన్సైట్స్ రెసిడెన్షియల్ వార్షిక రౌండప్-2021ని విడుదల చేసింది. అత్యధికంగా హైదరాబాద్లో సంవత్సర ధరల పెరుగుదల ఏడు శాతంగా నమోదైనట్లు వెల్లడైంది. గుజరాత్లోని అహ్మదాబాద్లోనూ ఏడు శాతం వృద్ధి ఉన్నప్పటికీ.. ధరలతో పోలిస్తే అక్కడ తక్కువగా ఉన్నాయని పేర్కొంది.
కరోనా మహమ్మారి తర్వాత నిర్మాణ వ్యయాలు పెరగడం, నిర్మాణ సామగ్రి సరఫరాల్లో అంతరాయంతో పాటు వాటి ధరలు కూడా గణనీయంగా పెరగడంతోనే నూతన అపార్ట్మెంట్ల వార్షిక ధరల్లో ప్రధానంగా హైదరాబాద్లో వృద్ధి ఎక్కువగా ఉందని నివేదికలో పేర్కొన్నారు. హైదరాబాద్ పరిధిలోని అపార్టుమెంట్లలో ఫ్లాట్ల ధరలు చదరపు అడుగు సరాసరిన రూ.5,900 నుంచి రూ.6,100 వరకు ఉంది. దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే.. అహ్మదాబాద్లోనూ ఈస్థాయి వృద్ధి కనిపించగా, మిగిలిన నగరాల్లో ధరల పెరుగుదల ఇంతకంటే తక్కువగానే ఉంది.
కరోనా మొదలైన 2020తో పోలిస్తే.. 2021లో దక్షిణాది రాష్ర్టాల్లో ఇండ్ల అమ్మకాల జోరు అధికంగా ఉందని నివేదికలో స్పష్టం చేశారు. దక్షిణాదిలో ఏకంగా 36 శాతం వృద్ధి నమోదైనట్లుగా తెలిపారు. ముఖ్యంగా హైదరాబాద్లో 2020లో అపార్టుమెంట్లలోని ఫ్లాట్ల విక్రయం 16,400గా ఉంటే… 2021లో 22,239గా నమోదైంది. సరఫరాలోనూ 2020లో 22,940 ఫ్లాట్లు ఉంటే 2021లో 48,566గా ఉన్నాయి. కాగా అమ్ముడుపోకుండా మిగిలిపోయిన ఇండ్ల జాబితాలో ఢిల్లీ ముందు వరుసలో ఉంది. ఇక్కడ 2021లో అందుబాటులోకి వచ్చిన ఇండ్లలో ఏకంగా 68 శాతం ఇండ్లు అమ్ముడుపోకుండా ఉన్నాయి. హైదరాబాద్లో ఇది 35శాతంగానే ఉంది.