సిటీబ్యూరో, డిసెంబర్ 2(నమస్తే తెలంగాణ), దుండిగల్ : నగర శివారు కేంద్రంగా డ్రగ్స్ తయారు చేసి, విక్రయాలకు పాల్పడుతున్న ముఠా గుట్టును స్థానిక సూరారం పోలీసులతో కలిసి తెలంగాణ స్టేట్ యాంటి నార్కోటిక్ బ్యూరో పోలీసులు రట్టు చేశారు. డ్రగ్స్ తయార చేసే ప్రధాన నిందితుడు సహా మొత్తం ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.50లక్షలు విలువజేసే 60 గ్రాముల మెతంఫెటమైన్ స్పటికలు, 700 మిల్లీ లీటర్ల మెతంఫెటమైన్ ద్రావణంతోపాటు 150 ఎం.ఎల్ల ఎసిటోన్, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు శనివారం బంజారాహిల్స్ ఐసీసీసీలోని నగర పోలీసు కమిషనరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీన్యాబ్ ఎస్పీ చక్రవర్తి కేసు పూర్వాపరాలను వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కమ్మ శ్రీనివాస్ అలియాస్ శ్రీను(40) ఉపాధి కోసం కొంత కాలం కిందట నగరానికి వలస వచ్చాడు. జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని ఓ కంపెనీలో పనిచేస్తూ 2013లో అక్రమంగా మెతంఫెటమైన్ డ్రగ్ను తయారు చేస్తూ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో పోలీసులకు దొరికిపోయాడు. అప్పట్లో నిందితుడి వద్ద నుంచి 10.9కిలోల మెతంఫెటమైన్ మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. జైలు శిక్ష కూడా అనుభవించిన నిందితుడు 2017 నవంబర్లో బెయిల్పై విడుదలయ్యాడు. అనంతరం నిందితుడు గాదిరోజు నర్సింహరాజు అలియాస్ అజయ్ అలియాస్ బబ్బి, డాట్ల మణికంఠతో స్నేహం ఏర్పర్చుకున్నాడు.
సులువుగా డబ్బు సంపాదించాలనే దురాశతో మత్తు పదార్థాలు తయారు చేయడంలో నిష్ణాతుడైన కమ్మ శ్రీనివాస్ డ్రగ్స్ తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు సూరారం ప్రాంగణంలో ఓ గదిని అద్దెకు తీసుకుని ఘన రూపంలో ఉన్న మెతంఫెటమైన్ను ద్రవరూపంలోకి మార్చే పరికరాలను కొనుగోలు చేశారు. ఈ క్రమంలో గత రెండేళ్లుగా 6 కిలోల మెథంఫెటమైన్ను తయారు చేస్తూ విక్రయించడం మొదలుపెట్టాడు. విశ్వసనీయ సమాచారం అందుకున్న టీన్యాబ్ పోలీసులు శనివారం స్థానిక పోలీసులతో కలిసి మత్తు పదార్థాలు విక్రయించేందుకు యత్నిస్తున్న కమ్మ శ్రీనివాస్, మణికంఠ, నర్సింహరాజులను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ.50లక్షల విలువజేసే మెథంఫెటమైన్ మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. ఈ మత్తు పదార్థం రిలాక్స్ మూడ్లోకి వెళ్లేందుకు వాడుతారని పోలీసులు వెల్లడించారు. యువత ఇలాంటి మత్తు పదార్థాల బారినపడి అమూల్యమైన జీవితాలను నాశనం చేసుకోవద్దని టీన్యామ్ ఎస్పీ చక్రవర్తి ప్రజలకు సూచించారు. ఎవరైనా ఇలాంటి డ్రగ్స్ విక్రయాలకు పాల్పడుతున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.