మేడ్చల్ రూరల్, జూలై 3: వివిధ కారణాలతో వేర్వేరు చోట్ల ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. కడుపు నొప్పి భరించలేక ఓ యువకుడు..కుటుంబకలహాలతో వివాహిత, మనస్తాపంతో మరో వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డారు. మేడ్చల్ పోలీసుల కథనం ప్రకారం.. ఎల్లంపేట గ్రామానికి చెందిన విష్ణువర్థన్(20) కొంత కాలంగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. శనివారం రాత్రి 10 గంటల సమయంలో భోజనం చేస్తుండగా కడుపునొప్పి రావడంతో గదిలోకి వెళ్లి ఉరివేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
క్షణికావేశంలో..
కరీంనగర్ జిల్లా వీణావంక మండలం వల్లభాపూర్కు చెందిన రేణుక(34) నరేందర్రెడ్డి దంపతులు మేడ్చల్లో నివాసముంటున్నారు. కరీంనగర్లో తీసుకున్న ప్లాట్ విషయంలో రేణుక భర్తతో శనివారం అర్ధరాత్రి గొడవపడి క్షణికావేశంలో ఫ్యాన్కు ఊరివేసుకుంది.
పక్కింటి యువకులు దాడి చేశారని..
శంషాబాద్ రూరల్, జూలై 3: పక్కింటి యువకులు ఆకారణంగా దాడి చేశారని మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. శంషాబాద్ రూరల్ సీఐ శ్రీధర్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. తొండుపల్లికి చెందిన నందకిశోర్(26) శంషాబాద్ ఎయిర్పోర్టులో పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి బోరు మోటర్ విషయమై నందకిశోర్ను పక్కింట్లో ఉండే అనిల్, ఆనంద్, హరీశ్ దాడి చేసి..తీవ్రంగా కొట్టారు. దీంతో మనోవేదనకు గురైన నందకిశోర్ ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడి కుటుంబసభ్యులు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ.. జాతీయ రహదారిపై బైఠాయించగా, పోలీసులు సముదాయించి పంపించారు. కేసు దర్యాప్తు చేపట్టారు.