కాచిగూడ, ఫిబ్రవరి 12: వేర్వేరు చోట్ల ముగ్గురు అదృశ్యమయ్యారు. స్నేహితురాలి ఇంటికి వెళ్లిన యువతి అదృశ్యమైన ఘటన కాచిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై హెచ్.నరేశ్ కథనం ప్రకారం.. తిలక్నగర్ ప్రాంతానికి చెందిన సోమయ్య కూతురు అపర్ణ (25)వృత్తిరీత్యా ప్రైవేటు ఉద్యోగి. ఆదివారం ఉదయం స్నేహితురాలిని కలిసి వస్తానని ఇంట్లో చెప్పి వెళ్లిన అపర్ణ తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు బంధువులు, స్నేహితుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కార్వాన్, ఫిబ్రవరి12: మతిస్థిమితం లేని ఓ వ్యక్తి అదృశ్యమైన ఘటన టప్పాచబుత్రా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ సీహెచ్. శ్రీనివాస్ కథనం ప్రకారం… నట్రాజ్ నగర్, జిర్రాలో నివసించే యూసుఫ్ ఖాన్(52)కు కొంత కాలంగా మతిస్థిమితం సరిగా లేదు. ఈ క్రమంలో ఇంట్లోనే ఉంటున్నాడు. కాగా గత డిసెంబర్ 5న ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన యూసుఫ్ ఖాన్ తిరిగి ఇంటికి రాలేదు. దీంతో వెతికినప్పటికి ఎలాంటి ఆచూకీ లభించలేదు. అతడి భార్య హసీనా బీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై యాదయ్య తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు టప్పాచబుత్రా పోలీసులకు తెలుపాలని సూచించారు.
శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 12: హాస్టల్ నుంచి బయటకు వెళ్లిన ఓ మహిళా డాక్టర్ అదృశ్యమైంది. ఈ ఘటన గచ్చిబౌలి పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఏఎస్సై సైదులు కథనం ప్రకారం… కడప జిల్లాకు చెందిన కే.శిరీషారెడ్డి(25) కొంతకాలం క్రితం ఓ కార్పొరేట్ హాస్పిటల్లో జనరల్ ఫిజిషియన్గా పనిచేసింది. ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో శిరీషారెడ్డి తన స్నేహితుడు సాయికి ఫోన్చేసి తాను వెళ్లిపోతున్నట్లు చెప్పి ఫోన్ స్విచ్చాఫ్ చేసింది. హాస్టల్ నుంచి బయటకు వెళ్లిన శిరీషారెడ్డి ఆచూకీ తెలియక పోవడంతో బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, శిరీషారెడ్డికి ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తెలిసిందని పోలీసులు పేర్కొన్నారు.