ముగ్గురు యువకుల అరెస్టు
రెండు తుపాకులు, రెండు మ్యాగజైన్లు,
13 బుల్లెట్లు, కారు, స్కూటీ స్వాధీనం
వివరాలను వెల్లడించిన మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి
కొండాపూర్, జూన్ 13 : ప్రాణహాని నెపంతో అనుమతులు లేకుండా తుపాకులతో సంచరిస్తున్న ముగ్గురు యువకులను మాదాపూర్ ఎస్వోటీ, మియాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు వివరాలను సోమవారం గచ్చిబౌలిలోని మాదాపూర్ డీసీపీ కార్యాలయంలో డీసీపీ శిల్పవల్లి వెల్లడించారు. యాదాద్రికి చెందిన రియల్ ఎస్టేట్, వైన్స్ నిర్వహకుడు జీ సాయికృష్ణ (26), తన చిన్ననాటి స్నేహితుడు సాయిరాం ఓ హత్యాయత్నం కేసులో నిందితులుగా ఉన్నారు. తమకు ప్రాణహాని ఉందన్న నెపంతో గన్స్ కొనుగోలు చేయాలకున్నారు. సాయిరాం ఓ సంస్థలో టీం లీడర్గా విధులు నిర్వహిస్తున్నాడు. అదే సంస్థలో పని చేసే తమిళనాడులోని పురుమనాల్ ప్రాంతానికి చెందిన స్వాన్ లియోనార్డ్ కన్నాతో పరిచయం ఉంది.
కన్నా ఇదివరకే స్థిరాస్తి వివాదాల్లో 5 పోలీసు స్టేషన్లలో నిందితుడిగా ఉన్నాడు. బీహార్లో గన్స్ సరఫరా చేసే వ్యక్తులతో కన్నాకు పరిచయం ఉందని తెలుసుకున్న సాయిరాం, సాయికృష్ణలు అతడిని సంప్రదించారు. రూ. 2 లక్షలు తీసుకుని బీహార్ వెళ్లి గన్, బుల్లెట్లు కొనుక్కుని నగరానికి వచ్చారు. సమాచారం అందుకున్న మాదాపూర్ జోన్ ఎస్వోటీ, మియాపూర్ పోలీసులు ఈ నెల 12న మియాపూర్ సాయిరాం టవర్స్ వద్ద నిర్వహించిన వెహికిల్ చెకింగ్స్లో నిందితులు మారణాయుధాలతో పట్టుపడ్డారు. ముందుగా స్కూటీపై ఉన్న కన్నా వద్ద తపంచా, 9 బుల్లెట్లను స్వాధీనం చేసుకోగా, కారులో ఉన్న సాయిరాం, సాయికృష్ణల వద్ద కంట్రీ మేడ్ పిస్టల్, మ్యాగజైన్, నాలుగు బుల్లెట్, రెండు మొబైళ్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా గన్ సప్లయర్ అలోక్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు డీసీపీ తెలిపారు. సమావేశంలో మియాపూర్ ఏసీపీ కృష్ణ, మియాపూర్ ఇన్స్పెక్టర్ తిరుపతిరావు, ఎస్వోటీ ఇన్స్పెక్టర్ శివ, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.