ఖైరతాబాద్, ఆగస్టు 20 : కుటుంబ పెద్ద అంత్యక్రియలకు హాజరై తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. ఖైరతాబాద్ పరిధిలోని ఆనంద్నగర్కాలనీ వాసులు కొండేటి కృష్ణ ్ర43), కొండేటి విజయరాణి (35) దంపతులు. వీరు కుమారుడు రుషి (14), కూతురు నిహారిక (18)తో కలిసి ఉంటున్నారు. తిరుపతిలోని బైరాగిపట్టేడ మండలంలో నివాసముండే కొండేటి కృష్ణ తండ్రి గత శుక్రవారం మృతి చెందగా, అదేరోజు సాయంత్రం కొండేటి కృష్ణ దంపతులు పిల్లలతో పాటు ప్రేమ్నగర్లోని ఇంజినీరింగ్ క్యాసిల్ అపార్టుమెంట్లో నివాసముండే అత్త అన్నె పద్మ (60)ను తీసుకొని కారులో వెళ్లారు. అంత్యక్రియలకు హాజరైన వీరు ఆదివారం తిరుగు ప్రయాణమయ్యారు. తిరుపతి నుంచి కడప మీదుగా వస్తుండగా.. చెన్నూరు జాతీయ రహదారి (ఎన్హెచ్40)పై ఉన్న ఆంధ్రా స్పైసీ హోటల్ వద్ద ఆగి ఉన్న లారీని వీరి కారు అతి వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కొండేటి కృష్ణ, రుషి, పద్మ అక్కడికక్కడే మృతిచెందగా, విజయరాణి, నిహారిక తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను కడప రిమ్స్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందడంతో ఆనంద్నగర్కాలనీ, ప్రేమ్నగర్లో విషాదఛాయలు అలుముకున్నాయి.