Girls Molest | హైదరాబాద్ : అసలు పరిచయమే లేని ముగ్గురు బాలికలను ప్రేమిస్తున్నామని మాయమాటలు చెప్పి.. వారిపై అత్యాచారానికి పాల్పడ్డారు ముగ్గురు యువకులు. బాలికలను హైదరాబాద్ నగరం నుంచి యాదగిరి గుట్టకు తీసుకెళ్లి అక్కడ ఓ లాడ్జ్లో అత్యాచారం చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. అల్వాల్ ప్రాంతానికి చెందిన ముగ్గురు బాలికలు బతుకమ్మ ఆడటానికని తమ నివాసాల్లోంచి బయల్దేరారు. 9వ తరగతి చదువుతున్న ఈ ముగ్గురు బాలికలు కూడా ఉస్మానియా యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లోకి వచ్చారు. అక్కడున్న ఓ యువకుడు వారిపై కన్నేశాడు. వారి దగ్గరికి వెళ్లి మాట కలిపాడు. తియ్యని మాటలు మాట్లాడుతూ.. ప్రేమిస్తున్నట్లు చెప్పాడు. ఆ లోపు మరో ఇద్దరు స్నేహితులను పిలిపించాడు.
మాటల్లో పెట్టి ముగ్గురి బాలికలను యాదగిరి గుట్టకు తీసుకెళ్లారు. అక్కడ ఓ లాడ్జిలోకి తీసుకెళ్లి మైనర్లపై యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. తిరిగి వారిని హైదరాబాద్ నగరంలో వదిలిపెట్టారు. ఇంటికి చేరుకున్న బాలికలను ఎక్కడికెళ్లారని వారి తల్లిదండ్రులు నిలదీయడంతో జరిగిన ఘోరాన్ని చెప్పారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు బాలికలకు కౌన్సిలింగ్ చేసి, అత్యాచారం జరిగినట్టు పోలీసులు నిర్ధారించారు. అఘాయిత్యానికి పాల్పడిన నిందితులను అదుపులోకి తీసుకుని, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితులను జీహెచ్ఎంసీ కాంట్రాక్ట్ ఉద్యోగి మధు(19), షాపింగ్ మాల్లో పనిచేసే వంశీ(22), పెట్రోల్ బంకులో పనిచేసే నీరజ్(21) గా పోలీసులు గుర్తించారు.