హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ)/ దామరచర్ల: యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ (వైటీపీపీ) నిర్మాణ ప్రాంగణంలో ప్రత్యేక దవాఖానను నిర్మించనున్నట్టు రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి వెల్లడించారు. కొవిడ్ నేపథ్యంలో ఏర్పాటుచేసే ఈ దవాఖాన నిర్మాణాన్ని 10 రోజుల్లో పూర్తిచేసి ప్రారంభించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. మంగళవారం ఆయన ట్రాన్స్ కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు, ఇతర ఉన్నతాధికారులతో కలిసి వైటీటీపీని సందర్శించారు. అనంతరం ఈ ప్లాంట్ నిర్మాణంపై అధికారులతో సమీక్షించారు. ప్లాంట్ నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చించారు. కార్మికుల్లో ధైర్యాన్ని నింపి పనుల్లో జాప్యం జరుగకుండా చూడాలని అధికారులకు జగదీశ్రెడ్డి దిశానిర్దేశంచేశారు.
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం 2023 నాటికి పూర్తవుతుందని మంత్రి జగదీశ్రెడ్డి మీడియాకు తెలిపారు. ప్రారంభదశలో ఈ ప్లాంట్ నిర్మాణాన్ని ఆపేందుకు కొందరు కుట్రచేసి గ్రీన్ ట్రిబ్యునల్కు వెళ్లారని, అయినప్పటికీ అన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని అవాంతరాలను అధిగమించి నిర్మాణంలో పురోగతి సాధించిందని అన్నారు. కరోనా వేళ ట్రాన్స్కో, జెన్కో సీఎండీ ప్రభాకర్రావు, ఉన్నతాధికారుల సూచనల మేరకు కార్మికులకు అందుబాటులో వైద్యం అందించాలని నిర్ణయించామని మంత్రి జగదీశ్రెడ్డి చెప్పారు. ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు మాట్లాడుతూ.. ప్రస్తుతం జెన్కో ఆధ్వర్యంలో రాష్ట్రంలో సుమారు 4 వేల మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి అవుతున్నదని, వైటీపీపీ నిర్మాణం పూర్తయితే మరో 4 వేల మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి అవుతుందని తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో బీహెచ్ఈఎల్ ప్రాజెక్టు డైరెక్టర్ సిసోడియా, ట్రాన్స్కో డైరెక్టర్లు అజయ్, సచ్చిదానంద్, టీఆర్కే రావు, కోల్ డైరెక్టర్ జేఎస్ రావు, ఎస్ఈ టెక్నికల్ ఈగ హన్మాన్ తదితరులు పాల్గొన్నారు.