Hyderabad | బంజారాహిల్స్, అక్టోబర్ 7 : ఒకే కుటుంబంలో ముగ్గురికి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం వరించింది. సుమారు 28 ఏళ్లుగా కుటుంబాన్ని పోషించడం కోసం ఆర్టీసీ డ్రైవర్గా పనిచేస్తున్న తండ్రి కష్టాన్ని ఎలాగైనా తగ్గించాలనే భావనతో కఠోరమైన సాధన చేసిన ఇద్దరు కొడుకులతో పాటు కోడలు పోలీస్ కానిస్టేబుల్గా ఎంపికయ్యారు. తన కుటుంబ సభ్యులకు ముగ్గురికి ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగం రావడంతో ఆర్టీసీ డ్రైవర్ ఆనంధానికి అవధులు లేకుండా పోయాయి.
ఫిలింనగర్లోని భగత్సింగ్కాలనీలో నివాసముండే కుడుకుంట్ల గోపాల్ 28 ఏళ్ల కిందట మహమూబ్ నగర్ జిల్లా పెబ్బేరు నుంచి బతుకుదెరువుకోసం నగరానికి వచ్చి ఆర్టీసీలో డ్రైవర్గా చేరాడు. అతడి భార్య శ్యామల గృహిణి. కాగా గోపాల్ పెద్ద కొడుకు కె.వాసు 2018లో బీటెక్ పూర్తిచేశాడు. అదే సంవత్సరంలో కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్షలో అర్హత సాధించినా రన్నింగ్లో విఫలమయ్యాడు. దీంతో కుటుంబ పోషణ కోసం చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నాడు. గోపాల్ చిన్న కొడుకు కె.వినయ్ ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో బీఎస్సీ కంప్యూటర్స్ చదువుతున్నాడు. ఇదిలా ఉండగా 2021 అక్టోబర్లో వాసుకు వనపర్తి జిల్లా జగత్పల్లి గ్రామానికి చెందిన ప్రభుత్వ టీచర్ కుమార్తె భవానీతో వివాహమైంది.
అయితే 2022లో తెలంగాణ ప్రభుత్వం పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడంతో ముగ్గురు దరఖాస్తు చేసుకున్నారు. అప్పటినుంచి కష్టపడి చదివి.. ప్రిలిమ్స్లోఉత్తీర్ణులయ్యారు. దీంతో ఫిజికల్ పరీక్షల కోసం కఠోరంగా శ్రమించారు. యూసుఫ్గూడ బెటాలియన్కు వెళ్లి రన్నింగ్, లాంగ్జంప్, హైజంప్ తదితర అంశాల్లో హెడ్ కానిస్టేబుల్ జంగయ్య వద్ద శిక్షణ పొందారు. ఈ క్రమంలో ఇటీవల విడుదలైన కానిస్టేబుల్స్ మెయిన్ పరీక్షల ఫలితాల్లో ముగ్గురికి ఉద్యోగాలు రావడంతో ఆర్టీసీ డ్రైవర్ గోపాల్ ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది.