హైదరాబాద్: హైదరాబాద్లో పెద్దమొత్తంలో గంజాయి చాక్లెట్లను (Ganja Chocolates) సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అరెస్టుచేసి వారిపై మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కింద కేసు నమోదుచేశారు. జీడిమెట్లలో బీహార్కు చెందిన శిబుకుమార్ అనే యువకుడు కిరాణా దుకాణం ముసుగులో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. కూలీలు, విద్యార్థులకు వాటిని విక్రయిస్తున్నట్లు తేల్చారు.
రామచంద్రాపురం బాలాజీనగర్లో సీతారామ్ అనే వృద్ధుడు, నిజాంపేటలో చంద్రశేఖర్ అనే వ్యక్తి గంజాయి చాక్లెట్లు అమ్ముతున్నట్లు గుర్తించారు. ఉత్తరప్రదేశ్, బీహార్ నుంచి వాటిని తీసుకువస్తున్నారని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి 250 ప్యాకెట్ల గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా చాచుపల్లి వద్ద నిషేధిత సిగరెట్లు అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. వారివద్ద లభించిన 114 ప్యాకెట్ల సిగరెట్లను సీజ్చేశారు.