బంజారాహిల్స్, జూలై 21: ‘మీరు చేసే వ్యాపారాలపై ఈడీ అధికారులు దృష్టి పెట్టారు.. సంస్థకు చెందిన అన్ని రహస్యాలు తమవద్ద ఉన్నాయి’.. అంటూ.. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ను బెదిరిస్తూ రూ.5 కోట్లు ఇవ్వాలని బ్లాక్మెయిల్ చేస్తున్న ఓ వ్యక్తిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు సోదరుడి కుమారుడు నంబూరి కళ్యాణచక్రవర్తికి రెండు తెలుగు రాష్ర్టాల్లో రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తదితర వ్యాపారాలు ఉన్నాయి. బంజారాహిల్స్ రోడ్ నంబర్- 2లోని లుంబినీ జువెల్ మాల్లో ఉన్న శుభగృహ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేటు లిమిటెడ్కు నంబూరి కళ్యాణచక్రవర్తి ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా వ్యవహరిస్తున్నాడు. కాగా, గత కొంతకాలంగా శుభగృహ సంస్థతో పాటు ఇతర సంస్థల వ్యాపార లావాదేవీలపై సమాచారం సేకరించిన సాయికుమార్తోపాటు బాచుపల్లిలోని డీఆర్కే ఇంజినీరింగ్ కళాశాల డైరెక్టర్గా వ్యవహరిస్తున్న మన్నెం చంద్రశేఖర్ (42) కలిసి బ్లాక్మెయిల్ చేసేందుకు ప్రణాళిక వేసుకున్నారు. దీనిలో భాగంగా మన్నెం చంద్రశేఖర్ రెండు నెలలుగా కళ్యాణచక్రవర్తికి ఫోన్లు చేస్తున్నాడు. మీ సంస్థకు చెందిన వ్యవహారాలపై ఈడీతో పాటు అనేక ప్రభుత్వ సంస్థలు కన్నేశాయని, అన్ని ఆధారాలు సేకరించి ఏ క్షణమైనా దాడులు నిర్వహించే అవకాశం ఉన్నదని బెదిరింపులకు గురిచేయడం ప్రారంభించాడు.
సాయికుమార్ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని, అతడితో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని, ప్రభుత్వంలో తమకున్న పలుకుబడిని ఉపయోగించి ఈడీ కేసులు కాకుండా చూస్తానని, లేకుంటే ఆధారాలన్నీ బయటపెట్టి కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకునే పరిస్థితులను కల్పిస్తామని బెదిరించాడు. ఈ క్రమంలో ఇటీవల బంజారాహిల్స్లోని పార్క్ హయత్ హోటల్కు వచ్చిన చంద్రశేఖర్ ఫోన్ చేయడంతో అక్కడికి వెళ్లిన కళ్యాణచక్రవర్తిని రూ.5 కోట్లు ఇవ్వకపోతే త్వరలోనే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించాడు. తమవద్ద అంతడబ్బు లేదని చెప్పగా.. కనీసం రూ.3 కోట్లయినా ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించాడు. దీంతో అక్కడి నుంచి విచ్చేసిన కళ్యాణచక్రవర్తికి పలుమార్లు ఫోన్లు చేస్తూ బెదిరింపులకు దిగాడు. బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఐపీసీ 387, 506 సెక్షన్ల కింద నిందితులపై కేసు నమోదు చేశారు. నిందితుడు మన్నెం చంద్రశేఖర్ను శుక్రవారం అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు. మరో నిందితుడు సాయికుమార్ ఇటీవలే అరెస్టయి ఏపీలో జైల్లో ఉన్నాడని తెలిసింది.