సిటీబ్యూరో, మే 2 (నమస్తే తెలంగాణ) : ఎయిర్పోర్టు మెట్రో ప్రాజెక్టు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఒకవైపు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ అధికారులు ఢిల్లీ ఎయిర్పోర్టు మెట్రో లైన్పై అధ్యయనం చేసి రాగా, మరోవైపు జనరల్ కన్సల్టెంట్గా ఎంపికైన సిస్ట్రా సంస్థ ఇంజనీర్ల బృందం క్షేత్ర స్థాయిలో ఎయిర్పోర్టు మెట్రో మార్గాన్ని అధ్యయనం చేస్తున్నారు. ఐటీ కారిడార్లోని రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు 31 కి.మీ మేర నిర్మించాలని ప్రతిపాదించిన మార్గానికి సంబంధించిన టెండర్ను రూపొందించే పనులను చేపట్టింది.
మెట్రో స్టేషన్లు, మెట్రోపిల్లర్ల నిర్మాణంతో పాటు వయాడక్ట్ల నిర్మాణానికి సంబంధించిన అంశాలను మెట్రో ఇంజినీర్లతో కలిసి క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేశారు. అదేసమయంలో రెండు రోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన మెట్రో అధికారుల బృందం అక్కడి ఎయిర్పోర్టు మెట్రో మార్గంలోని మౌలిక వసతులు, చెక్ ఇన్ స్టేషన్లలో కల్పించిన అత్యాధునిక సదుపాయాలను అధ్యయనం చేశారు. అక్కడ ఎదురవుతున్న ఇబ్బందులు, అనుభవాలను ప్రత్యక్షంగా మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో పాటు పలువురు ఇంజినీర్లు లోతైన అధ్యయనం చేసి వచ్చారు. ఉన్నాధికారులతో పలు అంశాలపై ప్రత్యేకంగా సమావేశమై చర్చలు జరిపారు.
ప్రాథమికంగా రాయదుర్గంలోనే ఎయిర్పోర్టు ప్రయాణికుల కోసం చెక్ ఇన్తో కూడిన మెట్రో స్టేషన్ నిర్మాణం చేపట్టాలని భావించినా, భవిష్యత్ అవసరాలు, ప్రాజెక్టుకు మంచి ఆదరణ ఉండాలంటే చెక్ఇన్ సౌకర్యాలతో 3-4 చోట్ల మెట్రో స్టేషన్లను నిర్మించాలని సూచన ప్రాయంగా నిర్ణయించారు. ఈ జాబితాలో రాయదుర్గం, నానక్రాంగూడ, నార్సింగి, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో ఎయిర్పోర్టు ప్రయాణికులకు అనుకూలంగా మెట్రో స్టేషన్లను నిర్మించడంపై కసరత్తు చేస్తున్నారు. ఈ నెలాఖరులోగా పూర్తి స్థాయిలో ప్రాజెక్టు నిర్మాణంపై స్పష్టత వస్తుందని మెట్రో అధికారి ఒకరు తెలిపారు.