సిటీబ్యూరో, జనవరి 21 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీ చరిత్రలో లేని విధంగా కొత్త సంప్రదాయానికి కమిషనర్ తెరలేపారు. ప్రతి ఏటా ఆర్థిక సంవత్సరానికి దాదాపు రూ. 6వేల కోట్లకు పైగా బడ్జెట్ను రూపొందించి అమలు చేస్తున్నది బల్దియా. స్టాండింగ్ కమిటీ ఆమోదం, సర్వసభ్య సమావేశంలో బడ్జెట్ ప్రతిపాదనను ప్రవేశపెట్టి సభ్యుల ఆమోదం తెలిపిన తర్వాతే ప్రభుత్వ అనుమతి తీసుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ సారి స్టాండింగ్ కమిటీ ఆమోదం లేకుండానే ప్రభుత్వానికి బడ్జెట్ ప్రతిపాదన చేరేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ విషయంలో స్టాండింగ్ కమిటీ ఎన్నికను, కౌన్సిల్ మీటింగ్ ఏర్పాటుపై కమిషనర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని కార్పొరేటర్లు విమర్శిస్తున్నారు.
బల్దియా చరిత్రలోనే లేని విధంగా హక్కులను కాలరాస్తున్నారని మండిపడుతున్నారు. వాస్తవంగా స్టాండింగ్ కమిటీ సభ్యుల పదవీ కాలం గతేడాది అక్టోబరులో ముగిసింది. నవంబర్లో ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలని అనుకున్నా.. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేశారు. డిసెంబర్ మొదటి వారంలో ఎన్నికల కోడ్ ముగిసినా.. స్టాండింగ్ కమిటీ ఎన్నికకు నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఎన్నికలను తొందరగా నిర్వహించాల ని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి బల్దియా కమిషనర్ రోనాల్డ్ రాస్కు ఆదేశాలు ఇచ్చినా.. ఆయన పెడచెవిన పెడుతూ వస్తున్నారు. ప్రభుత్వానికి సమాచారం ఇచ్చి ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత కమిషనర్దే. నూతన ప్రభుత్వం ఏర్పడటం వల్ల స్టాండింగ్ కమిటీకి సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వ నోటీసులో పెట్టి, ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నా.. కాలయాపన చేస్తున్నారని కమిషనర్పై కార్పొరేటర్లు మండిపడుతున్నారు.