Hyderabad | బండ్లగూడ, మార్చి 8 : పక్కా పథకం ప్రకారం దారి దోపిడీకి పాల్పడిన ముగ్గురు దుండగులను మైలార్దేవ్పల్లి పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేశారు. దుండగుల నుంచి 18 లక్షల రూపాయల నగదును స్వాధీన పరచుకున్నారు.
రాజేంద్రనగర్ డిసిపి చింతమనేని శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం… రాజస్థాన్ శిఖర జిల్లా ఫతేపూర్కు చెందిన సచిన్ స్వామి కాటేదాన్లోని సుమిత్ మోడీకి చెందిన ఎస్ఆర్ఎమ్ ప్లాస్టిక్ కంపెనీలో పనిచేశారు. రెండు సంవత్సరాల క్రితం సచిన్ను యాజమాన్యం పనిలో నుంచి తొలగించింది. అప్పటినుంచి పగతో రగిలిపోయిన సచిన్ అదే కంపెనీలో పని చేస్తున్న తన గ్రామానికి చెందిన హేమంత్ శర్మతో చేతులు కలిపాడు. పటేల్ పూర్ గ్రామంలో సచిన్ తన స్నేహితులైన ప్రశాంత్, సీతారామస్వామి, బంటి స్వామితో కలిసి హైదరాబాద్కు వచ్చారు. అప్పటికే కంపెనీలో పనిచేస్తున్న హేమంత్ శర్మ కంపెనీలో యజమాని కదలికలను సచిన్కు అందించారు. సుమిత్ తను బామ్మర్ది అయిన జితేందర్ బాలాజీని రాఘవేంద్ర నగర్లోని తన ఇంటి నుంచి 20 లక్షలు రూపాయలు తీసుకురమ్మని ఆదేశించారు. ఆ డబ్బులను కార్మికుల జీతాలకు మెటీరియల్ సరఫరా చేసిన వ్యక్తులకు పంపిణీ చేయాలని సూచించారు.
ఇది తెలుసుకున్న హేమంత్ సచిన్కు సమాచారం అందించాడు. టీవీఎస్ మోటార్ సైకిల్ పై లక్షల రూపాయలను తీసుకువస్తున్న జితేందర్ను ఎక్స్యూవీ 300 మహేంద్ర కారులో వచ్చిన దుండగులు మధ్యాహ్నం 2:45 సమయంలో రాఘవేంద్ర కాలనీలోని పవర్ రాటి ఇంటి ముందు ఢీ కొట్టారు. జితేందర్ కింద పడిపోగానే 20 లక్షల రూపాయల బ్యాగులు తీసుకొని స్వామి ముఠా పరార్ అయింది.
సమాచారం అందుకున్న వెంటనే రాజేంద్రనగర్ డిసిపి శ్రీనివాస్ నేతృత్వంలో రాజేంద్రనగర్ మైలార్దేవ్పల్లి క్రై విభాగం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఎస్ఓటి సీసీఎస్ పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నించారు. వాహనంలో నిర్మల్ నుంచి మహారాష్ట్ర వైపు వెళుతున్నట్టు గుర్తించారు. నిర్మల్ చెక్పోస్టు వద్ద చిక్కినట్టే చిక్కి తప్పించుకొని పారిపోయారు. దీంతో రాజేంద్రనగర్ ప్రత్యేక పోలీసు బృందాలు పటేల్ పూర్ గ్రామానికి చేరుకొని మాటువేసి దుండగులను పట్టుకున్నారు. వారి వద్ద 18 లక్షల రూపాయల నగదు, మూడు మొబైల్ ఫోన్లు, మహేంద్ర ఎక్స్ యు వి కారును సీజ్ చేశారు. అత్యంత చాకచక్యంగా వ్యవహరించిన మైలార్దేవ్పల్లి, సిసిఎస్, ఎస్ ఓ టి పోలీసులను డిసిపి చింతమనేని శ్రీనివాస్ అభినందించారు.