ఘట్కేసర్ రూరల్, ఆగస్టు 5: న్యూ మల్లెపల్లి హబీబ్నగర్కు చెందిన మహమ్మద్ సలీం కలర్ టీవీలు, హోం థియేటర్లను నగరం నుంచి వరంగల్కు నిత్యం సరఫరా చేస్తుంటాడు. జూలై 31న అతడి వద్ద పని చేసే ఉద్యోగి మహమ్మద్ షాబాద్ అలం వాహనంలో సరుకు తీసుకుని డ్రైవర్ మహ్మద్ అస్లంతో కలిసి వరంగల్కు వెళ్లాడు. అక్కడ టీవీలను నాలుగు దుకాణాలకు సరఫరా చేసి.. వారి వద్ద నుంచి రూ.5,50,000 లను తీసుకుని తిరుగుపయనమయ్యాడు. డబ్బుపై ఆశ పుట్టిన అస్లం మరో ముగ్గురు మిత్రులతో కుమ్మక్కై దోపిడీ నాటకం ఆడాడు. ఘట్కేసర్ పోలీస్స్టేషన్ పరిధి కేపాల్ చెక్ పోస్టు వద్ద ముగ్గురు వ్యక్తులు గొడవ పడి వాహనంలో ఉన్న రూ.5.5 లక్షలు దోచుకున్నారని యజమానికి సాయంత్రం సమాచారం అందించాడు. యజమాని పోలీసులకు అదే రోజు రాత్రి ఫిర్యాదు చేశాడు. పోలీసులు తమదైన పద్ధతిలో విచారణ జరుపగా, అస్లం నేరాన్ని అంగీకరించాడు. అతడితో పాటు మిత్రులు ఎండీ ఫిరోజ్, ముక్తార్, కరీంలను అరెస్టు చేసి..నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఘట్కేసర్ అడిషనల్ ఇన్స్పెక్టర్ జంగయ్య తెలిపారు.