పహాడీషరీఫ్, డిసెంబర్ 27: రెండు నెలల కిందట అదృశ్యమైన ఓ వృద్ధురాలు హత్యకు గురైంది. వృద్ధురాలి ఒంటిపై ఉన్న నగలు దోచుకునేందుకు పథకం వేసిన అదే గ్రామానికి చెందిన ఇద్దరు ఈ దారుణానికి పాల్పడ్డారు. వృద్ధురాలిని హత్య చేసిన నిందితులు.. మృతదేహాన్ని కాల్చి బూడిద చేశారు. ఆ బూడిదను డ్రైనేజీ మురుగు నీటిలో కలిపారు. స్థానికులు, కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారం మేరకు దర్యాప్తు చేపట్టిన బాలాపూర్ పోలీసులు.. కేసు మిస్టరీని ఛేదించారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. బాలాపూర్ గ్రామంలోని అంజిరెడ్డి కాలనీ నివాసి బొర్ర బాలమ్మ (62) వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్లో అటెండర్గా పని చేసి, రెండేండ్ల కిందటే పదవీ విరమణ చేసింది.
అక్టోబర్ 27వ తేదీన ఆమె ఉదయం 9 గంటల ప్రాంతంలో ఇంట్లో ఎవరికీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా బయటకు వెళ్లింది. తిరిగి ఇంటికి రాలేదు. అన్ని ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ లభించకపోవడంతో మరుసటి రోజు 28న ఆమె కుమారుడు బొర్ర బాబు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే ఆమె అదృశ్యానికి గల కారణాలపై గ్రామస్తులు, కుటుంబ సభ్యులను ఆరా తీశారు. లభించిన సమాచారం మేరకు పలువురిని విచారించి, నిందితులను గుర్తించారు.
నగల కోసమే హత్య..
బాలమ్మ ఒంటిపై ఆరు తులాల బంగారు నగలతో పాటు 150 తులాల వెండి నగలు కూడా ఉన్నాయి. వాటిని ఎలాగైనా కొట్టేయ్యాలని అదే గ్రామానికి చెందిన రాములు, అతడికి తెలిసిన లలిత పథకం వేశారు. దీంతో వీరిద్దరూ కలిసి బాలమ్మతో రోజూ మాట్లాడటం, స్నేహంగా ఉంటూ దగ్గరయ్యారు. కుట్రలో భాగంగా ఇద్దరు నిందితులు కలిసి అక్టోబర్ 27వ తేదీన బాలమ్మతో మాట్లాడి.. ఓ విషయం మాట్లాడాలి.. పలానా చోటకు రండి.. అని చెప్పారు.
వారి చెప్పినట్టే బాలమ్మ బయటకు వెళ్లి తిరిగి కనిపించలేదు. బాలమ్మను మల్లాపూర్ గ్రామంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లిన నిందితులు.. గొంతునులిమి హత్య చేశారు. ఆమె ఒంటిపై ఉన్న బంగారు, వెండి నగలు తీసుకున్నారు. ఆ తర్వాత మృతదేహాన్ని కాల్చివేశారు. బూడిదను డ్రైనేజీ మురుగు నీటిలో కలిపారు. సీసీ కెమెరాలు, అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు మంగళవారం నిందితులను గుర్తించి, అదుపులోకి తీసుకొని విచారించగా.. నేరాన్ని అంగీకరించారు. ఈ కేసు దర్యాప్తులో ఉంది.. పూర్తి వివరాలు బుధవారం వెల్లడిస్తామని ఇన్స్పెక్టర్ తెలిపారు. బాలాపూర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
చాంద్రాయణగుట్టలో హత్య
చాంద్రాయణగుట్ట, డిసెంబర్ 27: చాంద్రాయణగుట్ట పరిధిలో మంగళవారం ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. విషయం తెలుసుకొని హుటాహుటిన సంఘటనా స్థలానికి వచ్చిన ఏసీపీ షేక్ జహంగీర్, ఇన్స్పెక్టర్ ప్రసాద్ వర్మ బృందం.. హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఏసీపీ కథనం ప్రకారం.. గుల్షాన్ ఎక్బాల్ కాలనీలో ఖాలీంఖాన్ (40) హత్యకు గురైనట్లు సమాచారం వచ్చిందన్నారు. హత్యకు గల కారణాలు, నిందితుల వివరాలు ఇంకా తెలియరాలేదన్నారు. స్థానికులు అందించే సమాచారం, సీసీ కెమెరాల సహాయంతో నిందితులను పట్టుకుంటామని తెలిపారు. ఈ కేసును చాంద్రాయణగుట్ట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.