దుండిగల్, అక్టోబర్18: బాచుపల్లి పోలీసులు బుధవారం ప్రగతినగర్లో నిర్వహించిన తనిఖీల్లో రూ.2.25 కోట్ల విలువజేసే పట్టుచీరలను డంపింగ్ చేస్తుండగా పట్టుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధి ప్రగతినగర్లోని పంచవతీ అపార్ట్మెంట్ వద్దకు బుధవారం ఉదయం రెండు లారీలలో పట్టు చీరలను తీసుకువచ్చి డంప్ చేస్తున్నట్లు ఎన్నికల ఫ్లయింగ్ స్కాడ్కు సమాచారం అందింది. పోలీసుల సహాయంతో సంఘటన ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు వాటిని పరిశీలించారు. వీటిపై సరైన సమాధానం లేకపోవడంతో చీరల లోడ్తో ఉన్న లారీని సీజ్ చేశారు. అధికారులు అక్కడికి చేరుకునే లోపే.. ఓ లారీలోని 400 బ్యాగుల్లో ఉన్న చీరలను అపార్ట్మెంట్లోని బ్లాక్ నంబర్ 7డీ లో ఉన్న ఓ డబుల్ బెడ్రూం ఇంటిలోకి డంప్ చేశారు. అపార్ట్మెంట్ అసోషియేషన్ ఆఫీస్ రూంలో మరో 343 బ్యాగులను పట్టుకున్నారు. ఒక్కో లారీలో సుమారు రూ. కోటి పైచీలు విలువజేసే పట్టు చీరలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వాటి విలువ రూ.2 కోట్ల 25 లక్షల పైచీలుకు విలువ చేస్తుందని అంచనా వేశారు. లారీతో సహా, సరుకును బాచుపల్లి పోలీస్స్టేషన్కు తరలించి, పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. వరంగల్లోని కాశ పుల్లయ్య మాంగళ్య షాపింగ్ మాల్స్ నుంచి ప్రగతినగర్కు తీసుకొచ్చి హోల్సేల్ విక్రయాలు చేస్తున్నట్లు సంబంధికులు పేర్కొన్నారు. అయిన్పటికీ ఎలాంటి ఆధారాలు చూపించకపోవంతో వస్ర్తాలను, లారీలను సీజ్ చేశారు. కాగా, సదరు వ్యాపారులు హోల్సేల్ వ్యాపారం నిర్వహించేందుకు ట్రేడ్ లైసెన్స్, ఇతర అనుమతులు లేవీ లేన్నట్లు సమాచారం.
మెహిదీపట్నం: హుమాయూన్నగర్ పోలీసులు బుధవారం నిర్వహించిన తనిఖీల్లో ఓ వ్యక్తి రూ.30 లక్షలు లభించాయి. అతడి వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో సీజ్ చేసినట్టు ఏసీపీ రాజావెంకట్రెడ్డి తెలిపారు.
కార్వాన్: టప్పాచబుత్రా పోలీసులు బుధవారం రాత్రి వాహనాలు తనిఖీ చేపట్టారు. కారులో వెళ్తున్న ఓ వ్యక్తి రూ. 20 లక్షలు లభించాయి. ఎలాంటి పత్రాలు లేకపోవడంతో సీజ్ చేసినట్టు పోలీసులు తెలిపారు.
ఖైరతాబాద్ : పంజాగుట్ట పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో ఓ వ్యక్తి వద్ద రూ.13.50 లక్షలు లభించాయి. ఈ నగదుకు సంబంధించిన సరైన పత్రాలు లేకపోవడంతో సీజ్ చేసినట్టు పోలీసులు తెలిపారు.
కొండాపూర్ : చందానగర్ పోలీసులు నిర్వహించిన వాహనాల తనిఖీల్లో ఓ కారును పరిశీలించగా రూ.18 లక్షలు పట్టుబడ్డాయి. సరైన పత్రాలను చూపకపోవడంతో గదును సీజ్ చేసి, ఆదాయపన్ను శాఖ అధికారులకు అప్పగించినట్టు పోలీసులు తెలిపారు.
బంజారాహిల్స్: ఫిలింనగర్ పోలీసులు బుధవారం నిర్వహించిన తనిఖీల్లో ఓ వాహనంలో తరలిస్తున్న రూ. 3.10 లక్షల నగదును సీజ్ చేశారు. నగదుకు సంబంధించిన సరైన పత్రాలు లేకపోవడంతో సీజ్ చేసి, విచారణ చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.
బడంగ్పేట: మీర్పేట పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో రూ.1,21,050 నగదును పట్టుకున్నారు. ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో నగదును సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
మారేడ్పల్లి : సికింద్రాబాద్ రైల్వే పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో 538.03 గ్రాముల బంగారు ఆభరణాలు పట్టుబడ్డాయి. జీఎస్టీ అధికారుల సమక్షంలో ఆభరణాలను సీజ్ చేశారు.
కేపీహెచ్బీ: పోలీసులు మంగళవారం రాత్రి పీఎన్ఆర్ ఎంపైర్ బిల్డింగ్ వద్ద నిర్వహించిన వాహనాలను తనిఖీల్లో 3193.69 గ్రాముల బంగారు ఆభరణాలు, 1569.207 గ్రాముల వెండి ఆభరణాలు పట్టుకున్నారు. ఆభరణాలు తరలిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
నేరేడ్మెట్: నేరేడ్మెట్ పోలీసులు సైనిక్పురి చౌరస్తాలో బుధవారం నిర్వహించిన తనిఖీల్లో ఓ వ్యక్తి వద్ద నుంచి రూ. 4.50 లక్షలు సీజ్ చేశారు.
అబిడ్స్: అబిడ్స్ పోలీసులు బుధవారం నిర్వహించిన వాహన తనిఖీల్లో రూ.5 లక్షల 19 వేల 700 నగదు స్వాధీనం చేసుకున్నారు.