ఖైరతాబాద్, డిసెంబర్ 26 : తాము మరణిస్తూ పలువురికి అవయవదానం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పరిధిలోని వంగపల్లికి చెందిన జోగు చంద్రయ్య (48) రోజు కూలీ. తండ్రి జోగు బాలలింగం, భార్య పూలమ్మ, ఇద్దరు పిల్లలను పోషించుకుంటున్నాడు. ఈ నెల 23న చంద్రయ్య బైక్ పై వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ చంద్రయ్యను సికింద్రాబాద్లోని యశోద దవాఖానకు తరలించారు. చికిత్స అందిస్తున్న వైద్యులు ఈ నెల 25న బ్రెయిన్ డెడ్గా నిర్ధారించారు. కుటుంబ సభ్యులను జీవన్దాన్ ప్రతినిధులు కలిసి అవయవదానం విశిష్టతను వివరించగా వారు అంగీకరించారు. చంద్రయ్య శరీరం నుంచి కాలేయం, రెండు మూత్రపిండాలు, కండ్లను సేకరించారు.
మహబూబ్నగర్ జిల్లా బూత్పూర్ కరవేనాకు చెందిన గంగుల లక్ష్మారెడ్డి, నాగమణి దంపతుల కుమారుడు హన్మంత్ రెడ్డి (24) ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. ఈ నెల 22న తాను బైక్ పై వెళ్తూ అదుపుతప్పి కిందపడిపోయాడు. తీవ్రంగా గాయపడిన బాధితుడిని చికి త్స కోసం ఎల్బీనగర్లోని కామినేని దవాఖానలో చేర్పించారు. చికిత్స అందిస్తున్న వైద్యులు 24న బ్రెయిన్ డెడ్గా నిర్ధారించారు. జీవన్దాన్ ప్రతినిధుల కౌన్సిలింగ్తో అవయవదానానికి కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. కాలేయం, రెండు మూత్రపిండాలు, కండ్లతో పాటు ఓ ఊపిరితిత్తిని సేకరించారు. అత్యవసర రోగులకు అవయవాలను అందజేస్తామని వైద్యులు తెలిపారు. అవయవ దానానికి ముందుకొచ్చిన కుటుంబ సభ్యులను జీవన్దాన్ అభినందించింది.