సిటీబ్యూరో, నవంబర్ 7(నమస్తే తెలంగాణ): నామినేషన్ల ప్రక్రియకు మరో మూడురోజులు మాత్రమే మిగిలి ఉన్నది. దీంతో బుధవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మరింత జోరందుకోనున్నది. ప్రధాన పార్టీలతోపాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు, ఆయా పార్టీల రెబల్స్తో రిటర్నింగ్ అధికారి(ఆర్వో) కార్యాలయాల వద్ద సందడి నెలకొన్నది. ప్రధాన పార్టీలు భారీ ర్యాలీలతో వెళ్తూ నామినేషన్ను దాఖలు చేస్తుంటారు. ఆ సమయంలోనే అభ్యర్థులు సత్తా చూపించేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇందులో భాగంగానే భారీ ర్యాలీలకు ఎన్నికల అధికారుల నుంచి అనుమతులు పొందుతున్నారు.
ఒకేరోజు రెండు, మూడు పార్టీలకు చెందిన అభ్యర్థుల నామినేషన్లు ఉంటాయి. ఈ నేపథ్యంలో ర్యాలీలకు అనుమతి ఇచ్చే సమయంలో పోలీసులు ఆచితూచి అనుమతులు ఇస్తున్నారు. ఒక పార్టీ వెళ్లే రూట్కు, మరో పార్టీ వెళ్లే రూట్తో కలువకుండా, ఎదురు పడకుండా ఉండేలా ఆయా మార్గాలను, సమయాన్ని నిర్ణయిస్తున్నారు. ఒకేసారి రెండు ప్రత్యర్థి పార్టీల నాయకులు, కార్యకర్తలు ఎదురు పడితే ఇబ్బందులు ఎదురవుతాయి. రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల వద్ద కూడా నామినేషన్కు వచ్చే వారితో రద్దీగా ఉంటాయి, వంద మీటర్ల వరకు 144 సెక్షన్ అమలులో ఉన్నది. ఈ నేపథ్యంలో కార్యాలయాలకు 100 మీటర్లలో ఆంక్షలు ఉండటంతో కార్యకర్తలు అక్కడకు వెళ్లరు.. అయితే 100 మీటర్ల బయట ఎక్కువగా సిబ్బంది ఉంటారు.
ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభంలోనే రిటర్నింగ్ కార్యాలయాల వద్ద ప్రత్యేక బందోబస్తును నిర్వహిస్తున్నారు. నామినేషన్ల ప్రక్రియ 10వ తేదీన ముగుస్తున్నా, స్క్రూటీని, విత్డ్రాకు 15వ తేదీ వరకు సమయం ఉన్నది. ఈనెల 15వ తేదీ వరకు రిటర్నింగ్ కార్యాలయం వద్ద ఆంక్షలు ఉంటాయి. ఇప్పటికే ఆయా రాజకీయ పార్టీలు ప్రచారంలో స్పీడ్ పెంచారు. సమయం తక్కువగా ఉండటంతో ఎవరి ప్రచార వ్యూహాలు వారు అమలు చేస్తున్నారు.
మేడ్చల్, నవంబర్7(నమస్తే తెలంగాణ): రాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పరిధిలోని ఐదు నియోజకవర్గాల్లో మంగళవారం 13 నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ గౌతమ్ వెల్లడించారు. మేడ్చల్ నియోజకవర్గం నుంచి 6, మల్కాజిగిరి 2, కుత్బుల్లాపూర్ 2, కూకట్పల్లి 1, ఉప్పల్ 2 నామినేషన్లను సంబంధిత ఆర్వోలు స్వీకరించనట్లు తెలిపారు. నామినేషన్ల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ సంఘటలు జరగకుండా ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ వివరించారు. నామినేషన్లు ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 32 నామినేషన్లు దాఖలైనట్లు తెలిపారు.
శాసనసభకు జరిగే ఎన్నికలకు గానూ హైదరాబాద్ జిల్లాలో నాలుగవ రోజు మంగళవారం 34 మంది అభ్యర్థులు 38 నామినేషన్లు దాఖలు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్రాస్ తెలిపారు. కాగా, ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్ను అనుసరించి ఈనెల 10వ తేదీ వరకు స్వీకరించే నామినేషన్లను మధ్యాహ్నం 3 గంటల వరకు సంబంధిత రిటర్నింగ్ అధికారి కార్యాలయాల్లో అభ్యర్థులు దాఖలు చేయాల్సి ఉంటుంది.