ఆధునికతను అందిపుచ్చుకోవడంలో నగరవాసులు ఎప్పుడూ ముందే ఉంటారు. మార్కెట్లో వచ్చిన ప్రతి వస్తువును వినియోగించే ప్రయత్నం చేస్తుంటారు. ఆహారం నుంచి ఆహార్యం వరకు కొత్తదనాన్ని అందిపుచ్చుకొని ముందు వరసలో నిలుస్తారు. అయితే నాణేనికి మరోవైపు అన్నట్లుగా ఇందులో మంచితో పాటు చెడు కూడా పొంచి ఉన్నది. నగరవాసుల ఆహారపు అలవాట్లలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇంటి వంటకంటే ప్యాకేజ్డ్ ఫుడ్కే ఎక్కువ మంది జై కొడుతున్నారు. ఇందులో బ్రెడ్ నుంచి కూల్ డ్రింక్ వరకు అనేక పదార్థాలు ఉన్నాయి. కాగా, ప్యాకెజ్డ్ ఫుడ్ వినియోగంలోఢిల్లీ తర్వాత హైదరబాద్ నగరం ఉండటం విస్మయం కలిగిస్తున్నది. ఈ మేరకు జాతీయ పోషకాహార సంస్థ చేసిన అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఆ విశేషాలను మనమూ పరిశీలిద్దాం
సిటీబ్యూరో, జనవరి 4(నమస్తే తెలంగాణ) : రంగురంగుల కవర్లతో పొట్లాల ఆహారం(ప్యాకెట్స్ ఫుడ్) నగరవాసులను ఎంతగానో ఊరిస్తున్నాయి. అన్ని మెట్రో నగరాల్లో పొట్లం కట్టిన ఆహార పదార్థాలను దంచికొడుతున్నారు. ఏమాత్రం అవకాశం ఉన్నా..నచ్చిన ఫుడ్ను మిగలకుండా తినేస్తున్నారు. చాక్లెట్ల నుంచి మొదలుకుంటే చిప్స్ల వరకు అన్ని లాగించేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మెట్రో నగరాల్లో ఇదే తీరుగా ప్యాకేజ్డ్ ఫుడ్ను ఆరగిస్తుండగా, ఢిల్లీ తర్వాత హైదరాబాద్లోనే ఎక్కువ మంది ఉన్నట్లుగా జాతీయ పోషకాహార సంస్థ చేసిన అధ్యయనంలో తేలింది.
చాక్లెట్లు, బిస్కెట్లు, ఆలుగడ్డ చిప్స్, ఎనర్జీ డ్రింక్స్గా పిలిచే ఎరోనేటెడ్ డ్రింక్స్ నగరవాసుల జీవన శైలిలో భాగమయ్యాయి. వారంలో ఒక్కసారైనా వీటిని తినకుండా ఉండలేకపోతున్నారు. ముఖ్యంగా ఆరోగ్యంపై అవగాహన ఉండే కాస్మోపాలిటన్ నగరాల్లోనే వీటి వినియోగం ఎక్కువగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తున్నది. ఫుడ్ కవర్లపై లేబుళ్లతో వినియోగంపై జాతీయ పోషకాహార సంస్థ జాతీయ స్థాయిలో అధ్యయనం చేసింది. ఇందుకోసం దేశంలోని అన్ని ప్రాంతాలను ముఖ్యంగా మెట్రో నగరాలను ప్రామాణికంగా తీసుకుని సర్వే చేసింది. ఒకేసారి 3,800 మంది ఆహారపు అలవాట్లను ప్రాంతాల వారీగా అధ్యయనం చేసిన ఎన్ఐఎన్… పలు ఆసక్తికరమైన విషయాలను వెలుగులోకి తీసుకువచ్చింది. జాతీయ స్థాయిలో జరిగిన సర్వేకు పోషకాహార నిపుణులు సుబ్బారావు ప్రాతినిధ్యం వహించి ప్యాకేజ్డ్ ఫుడ్ కవర్లపై లేబుళ్లతో ప్రయోజనం, వినియోగం తీరును పరిశీలించారు.
పెరిగిన వినియోగం..
అధ్యయనంలో పాల్గొన్న వారి ఆహారపు అలవాట్ల ఆధారంగా చాక్లెట్లు, బిస్కెట్లు, కేకులు, ఐస్ క్రీంలు, చిప్స్, మిక్చర్, బ్రెడ్డు, శాండ్ విచ్ వంటి ఆహార పదార్థాల వినియోగం ఎక్కువగా ఉన్నట్లుగా తేలింది. పట్టణాల్లోనే వీటి వినియోగం అధికంగా ఉండగా.. ప్యాకెజ్డ్ ఫుడ్ విక్రయాలు ఏటా పెరుగుతున్నట్లుగా వెల్లడైంది. ప్రీ ప్యాకేజ్డ్ ఫుడ్స్ను నిత్యం తినేవారు 73శాతం మేర ఉన్నట్లుగా స్పష్టమైంది. ఇందులో పాలు, బ్రెడ్డు, మిక్చర్ పొట్లాలు, చిప్స్, శాండ్ విచ్, ఐస్క్రీం, బిస్కెట్లు, చాక్లెట్లు ఎక్కువగా ఉన్నాయి. ఇందులో స్వీట్స్ స్నాక్స్ కంటే ఉప్పుతో చేసిన చిరుతిళ్లను ఎక్కువ ఇష్టపడుతున్నారు. సర్వే చేసిన రోజున ఎక్కువగా ప్యాకెట్ పాలను 51.7శాతం మంది, బిస్కెట్లను 40శాతం మంది, స్నాక్స్ 28శాతం, బేవరేజెస్ 27శాతం, బేకరీ ఫుడ్ 23.5శాతం, తీపి పదార్థాలను 23.4శాతం మంది కొనుగోలు చేశారు.
వారానికోసారైనా కొనాల్సిందే..
ప్యాకెజ్డ్ ఫుడ్ తినకుండా ఉండే వారి కంటే వారానికోసారైనా ఖచ్చితంగా కొనుగోలు చేసి తినేవారు ఎక్కువగా ఉన్నట్లుగా తేలింది. ఇందులో ఎక్కువగా నూడిల్స్ ప్రియులు కూడా ఉన్నారు. వారానికి ఓసారైన తినేవారు 18శాతం మంది ఉన్నారు. అదేవిధంగా బ్రెడ్(21.8శాతం), చాక్లెట్లు(18.4), బిస్కెట్లు(25.5), చిప్స్(20.3), మిక్చర్(14.5), మురుకులు, చెగోడీలు వంటి స్నాక్స్ తినేవారు 18.4గా ఉన్నట్లుగా పండ్ల రసాల కంటే ఎక్కువగా ఎనర్జీ, కూల్ డ్రింకులను ఎక్కువగా వినియోగిస్తున్నారు.
పోషక విలువలను చూడనివారే ఎక్కువ..
ప్యాకెజ్డ్ పుడ్ను కొనుగోలు చేసే క్రమంలో..కవర్లపై సూచించే పోషక విలువలను చూడని వారు సగటున 60శాతానికి పైగా ఉన్నారు. ఇక పోషక విలువలపై అవగాహన ఉన్నవారిలో ఎక్కువగా చూసేది కూడా క్యాలరీలు, వెజ్, నాన్ వెజ్ వంటి విషయాలను తెలుసుకునేవారు ఎక్కువగా ఉన్నారు. క్యాలరీలను తెలుసుకునేవారి సంఖ్య 307మంది ఉండగా, వెజ్, నాన్ వెజ్ సింబల్ ఆధారంగా కొన్నవారు 656 మంది ఉన్నారు. అవేవీ చూడకుండా ప్యాకెట్లను కొనేవారి సంఖ్య సగటున 1950మంది ఉన్నారంటే… తీసుకుంటున్న ఆహారంలోని పోషకాలపై అవగాహన, ఆసక్తి లేనివారే ఎక్కువగా ఉన్నారని అధ్యయనంలో స్పష్టమైంది. కానీ లేబుళ్ల ఆధారంగా పోషకాహారంపై అవగాహన పెంచితే, ప్యాకెజ్డ్, ప్రాసెస్డ్ పుడ్ వినియోగాన్ని తగ్గించడానికి వీలు ఉంది. అదేవిధంగా జాతీయ స్థాయిలో ప్రామాణికమైన ఆహార లేబుళ్ల అవసరమైతే ఉన్నట్లుగా వెల్లడైంది.