Hyderabad | సిటీబ్యూరో, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్ హైదరాబాద్లో వాటర్ ట్యాంకర్కు డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా వెస్ట్జోన్ పరిధి శేరిలింగంపల్లి, మాదాపూర్, అయ్యప్పసొసైటీ, జూబ్లీహిల్స్, మణికొండ, రాయదుర్గం తదితర ప్రాంతాల్లో ట్యాంకర్ నీరు లేనిదే రోజువారీ కార్యక్రమాలు జరగని పరిస్థితి నెలకొన్నది. ఎండల తీవ్రత ఒకవైపు, గతంలో ఎన్నడూ లేని విధంగా వర్షాభావ పరిస్థితులు, వేసవి ప్రారంభంలో భూగర్భజలాలు అడుగంటిపోవడంతో జలమండలి వాటర్ ట్యాంకర్లకు డిమాండ్ నెలకొంది. ఈ నేపథ్యంలో ట్యాంకర్ బుక్ చేస్తే 48గంటల సమయం పడుతుందంటే డిమాండ్ ఏ మేర ఉందో అర్థం చేసుకోవచ్చు. వాటర్ ట్యాంకర్ రద్దీ నివారణకు జలమండలి ప్రత్యామ్నాయంగా అదనపు ట్యాంకర్లు, డ్రైవర్లను సమకూర్చుకోవడంతో పాటు ఫిల్లింగ్ స్టేషన్ల సంఖ్యను పెంచుతున్నప్పటికీ పెండింగ్ సంఖ్య గణనీయంగానే ఉంటుంది. రోజుకు సరాసరిగా 6500లకు పైగా ట్యాంకర్లు బుకింగ్ అవుతున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
ఈ ఏడాది మార్చి నెలలో మొత్తం లక్షా 69వేల ట్యాంకర్ల నీటిని అధికారులు సరఫరా చేశారు. గత నెల మార్చి 1న ట్యాంకర్ బుకింగ్ సంఖ్య 4588 ఉంటే 31వ తేదీ నాటికి ఈ సంఖ్య రోజుకు 6280 వరకు ఉంది. దాదాపు 1700 ట్రిప్పులు అదనంగా అధికారులు సరఫరా చేస్తూ వచ్చారు. మొత్తంగా గతేడాది మార్చిలో 79వేల ట్యాంకర్లు బుకింగ్ కాగా.. ఈ ఏడాది మార్చిలో మొత్తం లక్షా 19వేల బుకింగ్స్ వచ్చాయని అధికారులు పేర్కొన్నారు. ట్యాంకర్ డిమాండ్ను అంచనా వేసి జలమండలి ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకొని ట్యాంకర్లు, డ్రైవర్ల సంఖ్య పెంచుకోవడం జరిగిందని, మూడు షిప్టుల్లో పనిచేయడం, రాత్రి వేళల్లో షిఫ్ట్ పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించడం, అదనపు ఫిల్లింగ్ స్టేషన్లు, వాటర్ ఫిల్లింగ్ పాయింట్స్ పెంచడం లాంటి చర్యలు చేపడుతున్నట్లు ఎండీ సుదర్శన్ రెడ్డి తెలిపారు.
ట్యాంకర్ బుకింగ్లో క్యాన్ (నల్లా కనెక్షన్)నంబర్ తప్పనిసరి. అయితే సదరు వినియోగదారుడు అప్పటి వరకు నల్లా బిల్లు పెండింగ్లో ఉంటే వాటర్ ట్యాంకర్ నిరాకరణ చేస్తున్నారు. బిల్లు చెల్లిస్తేనే వాటర్ ట్యాంకర్ సరఫరా జరుగుతున్న పరిస్థితి. వాటర్ ట్యాంకర్ కోసం పెండింగ్ బిల్ క్లియర్ చేయడం, వెంటనే అపై ట్యాంకర్ కోసం ఫోన్ చేస్తే వెయింటింగ్ జాబితా పేరుకుపోతుంది. దీంతో ట్యాంకర్ నీరు దొరకక తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే నాన్ డొమిస్టిక్ (స్లమ్స్)లో కమర్షియల్గా భవనాన్ని కట్టి డొమిస్టిక్ ముసుగులో నెలకు 20కేఎల్ ఉచిత నీటిని పొందుతున్న కొందరు భవన యాజమానులు దాదాపు 30శాతం మంది వరకు పథకం కిందకు రాకముందు నీటి బకాయిలు ఉన్నారు. జలమండలి సరఫరా చేసే అరకొర నీటి సరఫరాతో వీరు సైతం ట్యాంకర్ బుక్ చేస్తే బిల్ పెండింగ్ కనబడుతుందని ట్యాంకర్ సరఫరా చేయలేమని చెబుతున్నారు.
జలమండలి పరిధిలో ఉన్న పలు ట్యాంకర్ ఫిల్లింగ్ స్టేషన్లను ఎండీ సుదర్శన్రెడ్డి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మణికొండ, నేతాజీపార్కు, షేక్పేట ఫిల్లింగ్ స్టేషన్లను పరిశీలించారు. జీహెచ్ఎంసీ నుంచి వచ్చిన తాత్కాలిక డ్రైవర్ల సేవల్ని వినియోగించుకోవాలని సూచించారు. రాత్రి సమయాల్లో వీలైనంత ఎక్కువగా వాణిజ్య నీటి అవసరాల ట్రిప్పులు సరఫరా చేస్తే.. పెండెన్సీ లేకుండా చూసుకోవాలన్నారు. ట్యాంకర్ బుకింగ్, డెలివరీ తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. బుకింగ్ టైమింగ్స్, ఏ సమయానికి డెలివరీ ప్రారంభిస్తున్నారు? అనే విషయాలను అధికారుల నుంచి తీసుకున్నారు. ట్యాంకర్ డెలివరీకి సంబంధించిన ఇన్ అండ్ ఔట్ లాగ్బుక్స్ పరిశీలించారు. ఫిల్లింగ్ స్టేషన్లలోని సీసీ కెమెరాలు సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా పరిశీలించాలని ఎండీ సూచించారు.