సిటీబ్యూరో, మే 7 (నమస్తే తెలంగాణ), వెంగళరావు నగర్, సుల్తాన్బజార్: నగరంలో మరో 12 రేడియాలజీ ల్యాబ్లను ఏర్పాటు చేయనున్నట్టు వీటిలో పదింటిని ఈ నెల పదకొండున ప్రారంభించనున్నట్టు వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు తెలియజేశారు. రోగుల సహాయకులకు మూడు పూటలా 5 రూపాయలకే భోజనం అందిస్తామని ఈ నెల 12న పద్దెనిమిది దవాఖానల్లో ప్రారంభిస్తామని వెల్లడించారు. సహాయకులు అవస్థలు పడకుండా ఉండేలా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో షెల్టర్ హోమ్స్ కూడా నిర్మించనున్నట్లు చెప్పారు. ఎర్రగడ్డలోని ఛాతి వ్యాధుల దవాఖాన, ఈఎన్టీ ఆస్పత్రి, సుల్తాన్ బజార్లోని ప్రసూతి దవాఖానల్లో శుక్రవారం మంత్రి హరీశ్ పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, మహమూద్ అలీ, టీఎస్ఎంఎస్ఐడి చైర్మన్ ఎర్రోళ్ళ శ్రీనివాస్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆయనతో పాటు ఆయా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈఎన్టీలో 35 కోట్లతో…
తొలుత ఎర్రగడ్డ ఛాతి దవాఖానకు చేరుకున్న మంత్రి హరీశ్ రావు స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, వెంగళరావు నగర్కార్పొరేటర్ దేదీప్య విజయ్తో కలిసి రూ.2.15కోట్ల విలువైన సిటీ-స్కాన్ను ప్రారంభించారు. ఆ తర్వాత కోఠి ఈఎన్టీ ఆస్పత్రికి చేరుకున్న మంత్రి హరీశ్ రావు టీఎస్ఎంఎస్ఐడి చైర్మన్ ఎర్రోళ్ళ శ్రీనివాస్, స్థానిక ఎమ్మెల్యే రాజాసింగ్లతో కలిసి అక్కడ 35 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ భవనానికి శంకుస్థాపన చేశారు. తదనంతరం.. సుల్తాన్బజార్ ప్రసూతి దవాఖానలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్యాదవ్లతో కలిసి ఆపరేషన్ థియేటర్లను ప్రారంభించారు.
5 రూపాయల భోజనం 12న ప్రారంభం
నగరంలోని అన్ని ప్రభుత్వ దవాఖానల్లో రోగి సహాయకులకు మూడు పూటల రూ.5కే భోజనం పెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని, ఈనెల 12న హైదరాబాద్కు చెందిన మంత్రులు, శాసన మండలి, శాసన సభ్యుల ఆధ్వర్యంలో 18 దవాఖానల్లో ఐదు రూపాయల భోజనాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. మారుమూల ప్రాంతాల నుంచి నగరంలోని దవాఖానలకు వచ్చే రోగుల సహాయకుల కోసం కొత్తగా నిర్మించబోయే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో షెల్టర్ హోమ్స్ నిర్మిస్తామని చెప్పారు.నగరంలో 12 రేడియాలజీ ల్యాబ్లను ఏర్పాటు చేయనున్నామని ఈనెల 11న 10ల్యాబ్లను ప్రారంభించనున్నట్లు మంత్రి వెల్లడించారు. రాబోయే రోజుల్లో సహజ ప్రసవాలకు ఇన్సెంటివ్ ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు మంత్రి హరీశ్ రావు తెలిపారు. అవసరం మేరకే పరీక్షలు చేయాలని, అవసరమైతేనే ఆపరేషన్లు చేయాలని ఎవరైనా తప్పులు చేసినట్లు రుజువైతే కఠిన చర్యలు తప్పవన్నారు.