బండ్లగూడ : తలసేమియా వ్యాధి నిర్మూలనకు హెచ్బిఎ2 పరీక్షలు తప్పనిసరి అని, ఈ వ్యాది నిర్మూలన తెలంగాణ రాష్ట్రం నుంచే ప్రారంభించేందుకు తాము సన్నాహాలు చేస్తున్నామని తలసేమియా అండ్ సికిల్ సేల్ సోసైటి అధ్యక్షుడు చంద్రకాంత్ ఆగర్వాల్ పేర్కొన్నారు.
రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో ఉన్న తలసేమియా అండ్ సికిల్ సెల్ సోసైటీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ప్రసంగించారు.తలసేమియా వ్యాదిని మొదటి దశగా తెలంగాణ నుంచి పూర్తిగా తరిమివేసేందుకు ఈ నెల 30, మే 1వ తేదిలలో తమ సోసైటి కార్యాలయంనందు జాతీయ స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు సోసైటి సభ్యులు తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హారీష్రావు రానున్నట్లు తెలిపారు. తలసేమియా వ్యాధి వల్ల అనేక మంది చిన్నారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వారికి 15 రోజులకు ఒక సారి రక్తమార్పిడి చేయవలసి ఉంటుందని తెలిపారు.అంతేకాకుండా వారికి ఖరీదైన వైద్యం కూడ అందించ వలసి వస్తుందన్నారు.
ఇంతటి భయంకరమైన తలసేమియాను మొదటి దశలోనే నిర్విర్యం చేసేందుకు తాము ఎంతో కృషి చేస్తున్నామన్నారు.ఇందుకోసం పెండ్లి చేసుకునేవారు, గర్బవతులు మొదటి వారంలో హెచ్బిఎ2 పరీక్షలు చేయించుకోవాలన్నారు.దీన్ని ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా తీసుకోవాలని తెలిపారు.
ఇప్పటికే పదవ తరగతిలో తలసేమియా వ్యాది గురించి ఇక సబ్జెక్టు ఉండేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో టీఎస్సీఎస్ ఉపాధ్యక్షులు రత్నావళి కొత్తపల్లి, కార్యదర్శి, డాక్టర్ సుమన్ జైన్, అలీంబేగ్ తదితరులు పాల్గొన్నారు.