సిటీబ్యూరో, మే 17(నమస్తే తెలంగాణ): బంధువుల ఇండ్లనే టార్గెట్ చేశారు.. పెండ్లికి వెళ్లిన ఐదు కుటుంబాల్లో పంజా విసిరారు.. 10 రోజుల్లో రూ.14 లక్షల సొత్తును చోరీ చేశారు. పెండ్లి నుంచి వచ్చిన కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఈ ఐదు దొంగతనాల విషయం వెలుగులోకి వచ్చింది. దర్యాప్తు చేసిన ఎల్బీనగర్ సీసీఎస్ పోలీసులు రాజస్థాన్కు చెందిన ఇద్దరు నిందితులను సోమవారం అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్ పాలీ జిల్లాకు చెందిన కిశోర్ చౌదరి గతంలో హైదరాబాద్లో హార్డ్వేర్, గ్లాస్ కటింగ్ దుకాణాలను నిర్వహించాడు.
అందులో నష్టం రావడంతో అప్పులపాలై ఇంటికి వెళ్లిపోయాడు. రెండో వివాహం చేసుకోవడంతో కుటుంబ సభ్యులు అతడిని గ్రామం నుంచి పంపేశారు. దీంతో మళ్లీ హైదరాబాద్కు వచ్చి గ్లాస్ కటింగ్ కాంట్రాక్ట్ను నిర్వహిస్తున్నాడు. అయితే.. వ్యసనాలకు డబ్బు సరిపోకపోవడంతో రాజస్థాన్లోని తన పక్క గ్రామానికి చెందిన అర్జున్సింగ్ను పిలిపించి చోరీలు చేయడం మొదలుపెట్టాడు. అయితే.. చైతన్యపురిలో నివాసముండే తన గ్రామానికి చెందిన ఐదు కుటుంబాల వారు పెండ్లి కోసం 10 రోజుల పాటు రాజస్థాన్లోని పాలీ గ్రామానికి వెళ్తున్నట్లు తెలుసుకున్నాడు.
వారు వెళ్లిన తర్వాత అర్జున్సింగ్తో కలిసి ముందుగా చైతన్యపురిలోని ఇంట్లో చోరీ చేశాడు. అక్కడ బైక్తో పాటు కొంత నగదు, బంగారం, వెండి ఆభరణాలను దొంగిలించారు. ఆ తర్వాత బైక్ నంబర్ మార్చి మిగతా నాలుగు ఇండ్లలో చోరీకి తెగబడ్డారు. ఇంటి యజమానులు తిరిగి వచ్చేసరికి ఇంట్లో చోరీ జరిగిందని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా ఇద్దరు దొంగలను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.14 లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నారు.