శేరిలింగంపల్లి, డిసెంబర్ 14 : సినీ పక్కీలో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంటిని లక్ష్యంగా చేసుకొని గుర్తు తెలియని అగంతకులు దోపిడీకి పాల్పడ్డారు. సీబీఐ ఏజెంట్లమంటూ.. ఇంట్లోకి ప్రవేశించి సోదాలు జరిపి లాకర్లో ఉన్న 135 తులాల బంగారు అభరణాలు, నగదును ఎత్తుకెళ్లారు. నానక్రాంగూడ పైనాన్షియల్ డిస్ట్రిక్లో గెటెడ్ కమ్యూనిటీ బహుళ అంతస్తుల భవనంలో జరిగిన ఈ చోరీ కలకలం సృష్టించింది. మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం…
భువన్ తేజ ఇన్ఫ్రా డెవలపర్స్ సంస్థ యజమాని వెంకట సుబ్రహ్మణ్యం తన భార్య భాగ్యలక్ష్మితో కలిసి నానక్రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్లోని జయభేరి ఆరెంజ్ కౌంటీ గెటెడ్ కమ్యూనిటీ బహుళ అంతస్తుల అపార్టుమెంట్ సీ-బ్లాక్ 110 ప్లాట్లో నివాసముంటున్నాడు. రియల్ ఏస్టేట్ వ్యాపారి కావడంతో తన ఇంటికి తరుచూ వ్యాపార పరంగా పలువురు ప్రముఖులు వస్తుంటారని ఎవ్వరినీ గేటు దగ్గర ఆపవద్దని.., తన పేరు చెబితే ప్లాట్కు పంపించాలని గెటెడ్ కమ్యూనిటీ సెక్యూరిటీకి వెంకట సుబ్రహ్మణ్యం సూచించారు.
ఈ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో మారుతీ ఎర్టిగా కారులో డ్రైవర్తో సహా నలుగురు వ్యక్తులు వచ్చారు. వెంకట సుబ్రహ్మణ్యం పేరు చెప్పి ఆరెంజ్ కౌంటి అపార్టుమెంట్లోనికి వెళ్లారు. కారు డ్రైవర్ కింద నిలిచి ఉండగా మిగతా వారు 110 ప్లాట్కి వెళ్లారు. ఇంట్లో ఉన్న వెంకట సుబ్రహ్మణ్యం భార్య భాగ్యలక్ష్మి తలుపుతీయగా ముగ్గురు వ్యక్తులు తాము సీబీఐ ఏజెంట్లమని, ఇంట్లో సోదాలు చేయాలని నమ్మించారు. 20 నిమిషాలు ఇంట్లో తనిఖీలు నిర్వహించిన సదరు వ్యక్తులు భాగ్యలక్ష్మి చేతిబ్యాగ్లో ఉన్న లాకర్ తాళం చేవిలు తీసుకొని లాకర్ను తెరిచారు.
అందులో ఉన్న 135 తులాల బంగారు అభరణాలు, రూ.లక్ష నుంచి 2 లక్షల నగదును తీసుకొని వెళ్లిపోయారు. దుండగులు వెళ్లిపోయిన అనంతరం లాకర్ను చూసి అభరణాలు లేవని గుర్తించిన భాగ్యలక్ష్మి భర్త వెంకట సుబ్రహ్మణ్యం కు విషయం తెలిపింది. ఇంటికి వచ్చిన వెంకట సుబ్రహ్మణ్యం తాము మోసపోయామని గుర్తించారు. సాయంత్రం 5 గంటల సమయంలో ఈ విషయమై భాగ్యలక్ష్మి గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మూడు ప్రత్యేక బృందాలతో నిందితుల కోసం ముమ్మరంగా గాలింపు చేపడుతున్నట్లు మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.
సినీపక్కీలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి తెలిసినవారి పనే అయి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. సీసీ పుటేజీని పరిశీలిస్తున్నామని, త్వరలో దుండగులను పట్టుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గెటెడ్ కమ్యూనిటీలకు సంబంధించి భద్రత విషయంలో జాగ్రత్తగా ఉండాలని, ఈ తరహా పొరపాట్లకు అవకాశం ఇవ్వవద్దని సూచించారు. అయితే నిందితులు భీమవరంకు చెందిన వారిగా పోలీసులు గుర్తించినట్టు, వారినిపోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.