కుత్బుల్లాపూర్, అక్టోబర్ 24: ఓ కేటుగాడు సినీఫక్కీలో చోరీకి పాల్పడ్డాడు. తాను ఇన్కంట్యాక్స్ డిపార్ట్మెంట్ అధికారి అని.. షాపు లైసెన్స్ ఇతర అనుమతుల పత్రాలు ఉన్నాయా’ అంటూ.. వచ్చి…. ఓ దుకాణంలో ఆభరణాలు తీసుకొని ఉడాయించాడు. పోతుపోతూ.. టాక్సీ డ్రైవర్నూ బురిడీ కొట్టించాడు. ఈ సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం…కుత్బుల్లాపూర్ నుంచి సుచిత్ర వైపునకు వెళ్లే ప్రధాన రోడ్డుకు ఇరువైపులా ఉన్న పలు బంగారు షాపుల్లోకి వచ్చిన ఆ కేటుగాడు.. మొదటగా హరిహరా జ్యువెల్లరీ దుకాణానికి వెళ్లి షాపునకు అనుమతులు, పత్రాలు ఉన్నాయా అంటూ.. నిర్వాహకులను గంభీరంగా ప్రశ్నించాడు.
తనకు అమ్మవారి విగ్రహం కావాలని కోరడంతో షాపు నిర్వాహకుడు బయట ఉన్నాడని, వచ్చే సరికి ఉండమని అందులో పని చేసే వారు జవాబిచ్చారు. దీంతో పక్కనే ఉన్న ఏజే జ్యువెల్లరీ దుకాణానికి వెళ్లి ఆభరణాలు చూసుకొని.. మొత్తం డబ్బులు గూగుల్ పే చేస్తానన్నాడు. అయితే షాపు నిర్వాహకుడు ముందుగా రూ.50 వేలు నగదు ఇవ్వాలని చెప్పడంతో ఏటీఎంలో తీసుకొస్తానని చెప్పి..అక్కడి నుంచి జారుకున్నాడు. మరికొంతదూరం రాగానే ఐమాత బంగారం షాపులో బాయ్స్తో మాట్లాడి.. యజమాని లేకపోవడంతో రూ.1.50 లక్షల విలువ గల ఆభరణాలను తీసుకొని, దానికి సంబంధించిన డబ్బులను ఫోన్పే ద్వారా ఆన్లైన్లో పంపిస్తున్నానని మాయమాటలు చెప్పి..ఫోన్ స్క్రీన్పై పంపిన్నట్లు చూపించాడు.
అయినా వారి ఖాతాకు డబ్బులు జమకాకపోవడంతో ‘నా ఫోన్లో పంపిన్నట్లు వచ్చింది కదా.. అరగంట తర్వాత మీ అకౌంట్కు జమ అవుతుంది..సర్వర్ డౌన్ ఉంద’ని నమ్మబలికి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇక్కడ సీన్ కట్చేస్తే..ఈ కేటుగాడు ఒక్కరోజు కోసం రూ.5 వేలకు ఓ టాక్సీ కారును మాట్లాడుకున్నాడు. సుచిత్రలో బంగారం షాపులో బంగారం తీసుకున్న తర్వాత అక్కడి నుంచి నేరుగా పైపులైన్ రోడ్డు మార్గం మీదుగా వెళ్లాడు. అక్కడ కారు ఆపి ఇప్పుడే వస్తానని డ్రైవర్కు చెప్పి..పారిపోయాడు.
అంతకుముందు కారు డ్రైవర్ వద్ద రూ.2 వేలు తీసుకొని మొత్తం కలిపి ఇస్తానని అసలుకే ఎసరు పెట్టాడు. అక్కడే వేచి ఉన్న డ్రైవర్ అతడి కోసం ఎదురు చూసినా.. ఫలితం లేకపోవడంతో సదరు నగల షాపు వద్దకు వచ్చి ఆరా తీశాడు. అప్పుడు తేరుకున్న బంగారు షాపు నిర్వాహకుడు రూ.1.50 లక్షలు ఇంకా తమ ఖాతాకు జమకాలేదని చూసుకొని.. తాను మోసపోయానని గుర్తించి.. పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కాగా, బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చీటింగ్ కేసు నమోదు చేశామని ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. దర్యాప్తు మరింత వేగవంతం చేసి నిందితుడిని పట్టుకుంటామన్నారు.