సిటీబ్యూరో, సెప్టెంబర్ 21(నమస్తే తెలంగాణ) : నేపాల్ దొంగలను పట్టుకునేందుకు సైబరాబాద్ పోలీసులు గాలింపును ముమ్మరం చేశారు. దేశ సరిహద్దు భద్రత దళాలను అప్రమత్తం చేశారు. సరిహద్దు దాటి నేపాల్ వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ నిందితులకు సంబంధించిన ఫొటోలను పంపించారు.
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధి టెలికాం కాలనీ రోడ్డు నెం.9లోని గోవింద్రావు వ్యాపారి ఇంట్లో ఆదివారం చోరీ జరిగింది. ఆ ఇంట్లో పని చేసే నేపాల్ దేశానికి చెందిన దంపతులు పవిత్ర, లక్ష్మణ్లు కేజీకి పైగా బంగారం, రూ.15 లక్షల నగదును ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. అయితే నిందితులను పట్టుకునేందుకు సైబరాబాద్ పోలీస్ ఉన్నతాధికారులు మూడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. నిందితుల కోసం గాలింపును ముమ్మరం చేశారు.
నేపాల్కు చెందిన లక్ష్మణ్, పవిత్ర దంపతులు టెలికాంకాలనీలోని గోవింద్రావు ఇంట్లో చోరీకి పాల్పడిన తర్వాత ఉబర్ సంస్థ ద్వారా క్యాబ్ను బుక్ చేసుకున్నారు. టెలికాం కాలనీ నుంచి నేరుగా ముంబైకి కారును మాట్లాడుకున్నారు. దీని కోసం రూ.10 వేలు కిరాయి చెల్లించారు. కారులో ప్రయాణం చేస్తుండగా తమ ఇంట్లోని కుటుంబ సభ్యులు అనారోగ్యం బారిన పడ్డారని, వేగంగా వెళ్లాలని డ్రైవర్ను కోరినట్లు తెలిసింది. అయితే ముంబై నుంచి ఎక్కడికి వెళ్లి ఉంటారనే సమాచారంపై పోలీసులు దృష్టి పెట్టారు. అదే విధంగా ఢిల్లీ, ముంబై, సిమ్లా, ఉత్తర్ప్రదేశ్ తదితర రాష్ర్టాల్లోని పోలీసులను అప్రమత్తం చేశారు. మొత్తానికి నిందితులను సరిహద్దు దాటక ముందే పట్టుకోవాలనే పట్టుదలతో సైబరాబాద్ పోలీసులు ఉన్నారు.