జియాగూడ, మే 16: జియాగూడలో భారీ చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు రూ.25 లక్షల నగదు, 41 తులాల బంగారం, రెండు కేజీల వెండి నగలను ఎత్తుకెళ్లారు.. ఈ సంఘటన కుల్సుంపురా పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ శంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. జియాగూడ, వెంకటేశ్వరనగర్లోని రెండు అంతస్థుల భవనంలో శ్రీనివాస్ నివాసం ఉంటున్నాడు. కూతురు పెండ్లి కోసం రూ.25 లక్షల నగదు, 41 తులాల బంగారం, రెండు కేజీల వెండి నగలను ఇంట్లో పెట్టాడు. కాగా..
శనివారం అర్ధరాత్రి దొంగలు.. ఇంటి తలుపులకు బయట నుంచి గడియపెట్టి.. ఒక గది తలుపులు పగులగొట్టి రెండు బీరువాల్లో ఉన్న నగదు, బంగారం, వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు.. తెల్లవారుజామున అద్దెకు ఉండే వ్యక్తి గమనించి ఇంటి యజమానికి ఫోన్చేసి చెప్పాడు. వెంటనే అతను తలుపులు ఓపెన్ చేయబోగా తెరుచుకోకపోవడంతో అద్దెకు ఉండేవారికి చెప్పాడు. వారు వచ్చి తీయగా.. శ్రీనివాస్ బయటకు వచ్చి వెళ్లి చూసి.. పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు, క్లూస్ టీమ్లు వచ్చి ఆధారాలు సేకరించారు. అలాగే అదే ప్రాంతంలో పక్క వీధిలో నివాసముండే లక్ష్మమ్మ ఇంట్లో అర్ధతులం బగారం, 15 వేల నగదు చోరీకి గురైనట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గోషామహాల్ ఏసీపీ నరేందర్రెడ్డి, ఇన్స్పెక్టర్ శంకర్ చోరీలు జరిగిన ఇండ్లను పరీశీలించారు. ఈ మేరకు కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.