వెంగళరావునగర్, జూన్ 7 : ఏటీఎంలో డబ్బు డ్రా చేసుకునేందుకు వెళ్లిన ఓ యువకుడికి కరెన్సీ నోట్లతో ఉన్న క్యాష్ బ్యాగ్ కనిపించింది. రూ.2.75 లక్షల నగదు ఉన్న ఆ బ్యాగ్ను యువకుడు పోలీసులకు అప్పగించాడు. మధురానగర్ పోలీసుల కథనం ప్రకారం.. కార్మికనగర్కు చెందిన అర్పం క్యాష్ డ్రా చేసుకోవడానికి రహ్మత్నగర్ ఏటీఎం సెంటర్కు వెళ్లాడు. ఏటీఎం సెంటర్లో రూ.2.75 లక్షలు ఉన్న బ్యాగ్ అతడి కంటపడింది. బుధవారం మధురానగర్ పోలీసులకు అప్పగించాడు. ఇదిలా ఉండగా.. సతీష్ వైన్ షాప్ యజమాని మంగళవారం రాత్రి తన క్యాషియర్కు రూ.3 లక్షలు ఇచ్చి బ్యాంకులో డిపాజిట్ చేయాలని సూచించాడు.
క్యాషియర్ రహ్మత్నగర్ ఏటీఎం సెంటర్కు వెళ్లి రూ.25 వేలు డిపాజిట్ చేసి, మిగిలిన రూ.2.75 లక్షలు ఉన్న బ్యాగ్ను అక్కడే మర్చిపోయి వెళ్లిపోయాడు. గంట తర్వాత అతడికి బ్యాగ్ గుర్తు రావడంతో ఏటీఎం సెంటర్కు వెళ్లి చూడగా కనిపించలేదు. దీంతో బాధితుడు మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. క్యాష్ బ్యాగ్ను పోగొట్టుకున్న రాంరెడ్డికి పోలీసుల సమక్షంలో అర్పం బ్యాగ్ను అందజేశాడు. నిజాయితీ చాటుకున్న యువకుడు అర్పంను మధురానగర్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్సై ఉదయ్ అభినందించారు.