మారేడ్పల్లి, ఫిబ్రవరి 1: సికింద్రాబాద్ నియోజకవర్గం సీతాఫల్మండి డివిజన్లో బుధవారం స్థానిక కార్పొరేటర్ సామల హేమతో కలిసి డిప్యూటీ స్పీకర్ టి. పద్మారావు గౌడ్ ఇంటింటికీ తిరుగుతూ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. డివిజన్ పరిధిలోని చిలకలగూడ, మేడిబావి, కిందిబస్తీ, ఇందిరానగర్, సీతారాంనగర్, నామాలగుండు, ఉప్పర్బస్తీ, బ్రాహ్మణబస్తీ, కింది బస్తీ, తదితర ప్రాంతాల్లో లబ్ధిదారులకు రూ. 35 లక్షల విలువ చేసే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను డిప్యూటీ స్పీకర్ టి. పద్మారావు గౌడ్ అందజేశారు. అదేవిధంగా డివిజన్ పరిధిలోని మేడిబావి ప్రాంతంలో రూ. 18 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను డిప్యూటీ స్పీకర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…సికింద్రాబాద్ పరిధిలోని సీవరేజ్, మంచినీటి పైపులైన్ల ఏర్పాటు పనులను పూర్తి చేసిన వెంటనే కొత్త రోడ్ల నిర్మాణ పనులను చేపట్టాలని అధికారులకు సూచించడం జరిగిందన్నారు. కొత్త రహదారుల నిర్మాణానికి నిధులను కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. కింది బస్తీ ప్రాంతంలో మ్యాన్ హోళ్ల నిర్మాణం పనులను వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కిశోర్కుమార్, రామేశ్వర్గౌడ్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.