సిటీబ్యూరో, ఫిబ్రవరి 16(నమస్తే తెలంగాణ) : లాస్ట్ మైల్ కనెక్టవిటీ లేదు. అధిక ధరలతో ఎవరూ రావడం లేదు. మొత్తానికి 2027 నాటికి 10లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చడమే మెట్రో లక్ష్యం నీరుగారిపోతుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే మెట్రో చార్జీలను పెంచింది. దీంతో మూడేళ్లలో 50వేలు పెరిగి 4.6లక్షలకు చేరింది. కానీ ధరల పెంపుతో ప్రయాణికుల సంఖ్య ఒక్కసారిగా 4.10లక్షలకు పడిపోయింది. గతేడాది పెరిగిన టికెట్ ధరలు, ఏడేళ్లు గడిచినా అందుబాటులోకి రాని లాస్ట్ మైల్ కనెక్టవిటీ వంటి అంశాలు నగర మెట్రోకు శాపంగా మారాయి.
ముఖ్యంగా లాస్ట్ మైల్ కనెక్టవిటీ లేకపోవడంతో ప్రధాన స్టేషన్లకు జనాలు రావడమే ఆసక్తి చూపడం లేదు. స్టేషన్ల నుంచి గమ్యస్థానాలకు చేరుకునేందుకు రాత్రి సమయంలో ఇబ్బందిపడాల్సి వస్తుంది. అదే విధంగా ప్రధాన మెట్రో స్టేషన్ల వద్దకు చేరుకున్న తర్వాత వాహనాలు పార్కింగ్ చేసే వెసులుబాటు లేకపోవడంతో ఎక్కువ మంది మెట్రో అంటేనే ఆసక్తి చూపడం లేదు. కేవలం ఐటీ ఉద్యోగులు మాత్రమే అనివార్యంగా మెట్రో ఎక్కాల్సిన అవసరం ఏర్పడుతుందని ఆవేదన చెందుతున్నారు. కనీసం నిత్యం మెట్రోలో ప్రయాణించే వారికి మెరుగైన మౌలిక వసతులు కల్పించడం లేదని వాపోతున్నారు.
పెరగని లాస్ట్ మైల్ కనెక్టివిటీ…
నగరంలో ప్రస్తుతం ఓలా, ఉబర్, సువిధ, మెట్రో రైడ్, ఆర్టీసీ వంటి సంస్థలతో మెట్రో స్టేషన్లకు కనెక్టవిటీ కేవలం మొత్తం స్టేషన్లలలో 20శాతం లోపే ఉంది. మిగిలిన స్టేషన్ల పరిసరాల్లో ఉండే వారు సొంత వాహనాలు, ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మెట్రోను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో మెట్రో చార్జీలతోపాటు అదనంగా స్టేషన్లకు చేరుకునేందుకు ఖర్చు చేయాల్సి వస్తుందని వాపోతున్నారు. ప్రస్తుతం నగరంలోని ప్రధానమైన రెండు కారిడార్లలో 67 మార్గాల్లో ఈ సదుపాయం కల్పిస్తుండగా.. ప్రయాణికుడిపై రూ. 15-40 వరకు భారం పడుతుంది. కొన్ని సందర్భాల్లో ఫీడర్ సదుపాయాల్లో కలిగే అంతరాయంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ముఖ్యంగా ఐటీ కారిడార్ మార్గంలో ప్రయాణించి, అక్కడి నుంచి కార్యాలయానికి వెళ్లేందుకు మరోసారి ఆటో లేదా రాపిడో వంటి బైక్ ఆపరేటర్లను ఆశ్రయించాల్సి వస్తుందని వివరించారు. ప్రయాణికులపై భారం పడకుండా మెట్రో ఎల్ అండ్ టీ సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేయగలిగితే ప్రయాణికుల సంఖ్య పెరగడంతోపాటు, అదనపు ఖర్చులు తగ్గుతాయని మెట్రో ప్రయాణికులు వాపోతున్నారు. కనీసం ఆర్టీసీ షటిల్స్ తప్పనిసరిగా అందుబాటులో ఉంచాల్సి ఉంది. కానీ ఇప్పటికీ కొన్ని మార్గాల్లో ఆర్టీసీ బస్సులు నడిచే పరిస్థితి లేదు. అదే విధంగా మెట్రో స్టేషన్ల వద్ద పార్కింగ్ ప్రాధాన్యత కల్పించాల్సి ఉంది. కానీ అవేవి చేయకుండా మెట్రోకు ప్రయాణికులు పెంచడంపై దృష్టి పెట్టడం లేదు.