అల్వాల్, మార్చి 5: ఓటర్ కార్డు, ఆధార్ కార్డు లింక్ ప్రక్రియ అల్వాల్ సర్కిల్లో కొనసాగుతోంది. ఇంటి వద్దకు వచ్చే బీఎల్వోలకు ఓటర్లు ఆధార్ వివరాలు ఇచ్చి సహకరించాలని అధికారులు కోరుతున్నారు. అల్వాల్ సర్కిల్ పరిధిలోని అల్వాల్, బొల్లారం, వెంకటాపురం డివిజన్లలో త్వరలోనే వందశాతం లక్ష్యాన్ని చేరుకుంటామని అంటున్నారు. అల్వాల్ సర్కిల్ పరిధిలో మొత్తం సుమారు 2 లక్షల మంది ఓటర్లున్నారు. వీరి ఓటర్ కార్డుకు ఆధార్ లింక్ చేయించేందుకు మున్సిపల్ డీసీ, ఎమ్మార్వో, ఏఎంసీకి బాధ్యతలు అప్పగించారు. వీరి ఆదేశాల మేరకు ఆర్పీలు, ఎంటమాలజీ, అంగన్వాడీ టీచర్లు ప్రతి ఇంటికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. వాటిని గరుడ యాప్లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే వారికి ఓటర్ల నుంచి అనేక ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
‘మా ఆధార్ నెంబర్ ఎందుకు ఇవ్వాలి ?, వాటికి బ్యాంక్ అకౌంట్లు లింకై ఉంటాయి. ఏదైనా సైబర్ అటాక్ జరిగితే ఎలా? ఆధార్ వివరాలు ఎలా బహిర్గతం చేస్తాం?’అని ప్రశ్నలు సంధిస్తున్నారు. అయితే ఇది కేవలం ఆధార్ నంబర్ ఎంటర్ చేసుకోవడమేనని, ఎలాంటి ఓటీపీ నంబర్లు తాము అడగడం లేదు కదా అని బీఎల్వోలు సమాధానమిస్తున్నారు. అయినా ఓటర్లు ఆధార్ నంబర్ ఇవ్వడానికి అంతగా ఆసక్తి చూపడం లేదని అధికారులు పేర్కొన్నారు.
మరోవైపు అల్వాల్లో చాలామంది ఉద్యోగులే నివసిస్తుంటారు. దీంతో బీఎల్వోలు ఇళ్లకి వెళ్లినప్పుడు వారు అందుబాటులో ఉండటం లేదు. ఒక ఇంటికే రెండు, మూడు సార్లు వెళ్లాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. ఇక కరోనా సమయంలో చాలామంది సొంతూళ్లకు తిరిగి వెళ్లిపోయారు. వారి ఓటర్ ఇక్కడే ఉండటంతో వారిని ట్రేస్ చేయడం కష్టంగా మారింది. వారి ఫోన్ నంబర్లు సంపాదించడం ఇబ్బందిగా మారిందని, అలా చాలా మంది ఓటర్ల ఆచూకీ లభించడం లేదు. ఇక అంగన్వాడీల టీచర్లను మధ్యాహ్నం వరకు అంగన్వాడీ సెంటర్ల నిర్వహణ చూసుకోమని, తర్వాత ఓటర్-ఆధార్ లింక్ చేసే విధులకు వెళ్లాలని మున్సిపల్ కార్యాలయం నుంచి ఆదేశాలున్నాయి. దీంతో వారు మధ్యాహ్నం తర్వాత ఓటర్ల ఇళ్లకు వెళ్తే ఎవరూ ఉండటం లేదని, దీంతో అధికారులు ఇచ్చిన లక్ష్యం పూర్తి చేయలేకపోతున్నామని అంటున్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యేవరకు పూర్తిగా బీఎల్వోల విధులకే కేటాయించాలని కోరుతున్నారు. లేకపోతే రెండు వైపులా విధులు నిర్వర్తించడం కష్టంగా మారిందని అంగన్వాడీ వాపోతున్నారు.
అల్వాల్ సర్కిల్ పరిధిలో మొత్తం సుమారు 2 లక్షల ఓట్లకు ఆధార్ అనుసంధానం చేయిస్తున్నాం. ఎన్నికల సమయానికి దీన్ని పూర్తి చేయాలని భావిస్తున్నాం. అయితే చాలామంది ఓటర్లు ఆధార్ నంబర్ ఇవ్వడానికి సహకరించడం లేదని మా దృష్టికి వచ్చిం ది. ఆధార్ నంబర్ ఇవ్వడం వల్ల ఎలాంటి నష్టం లేదని, ఓటర్లు బీఎల్వోలకు సహకరించాలన్నారు. కేవలం బోగస్ ఓటర్లను ఏరివేసేందుకే ఈ వివరాలు సేకరిస్తున్నామని డీసీ నాగమణి వెల్లడించారు.