సిటీబ్యూరో, జూన్ 28(నమస్తే తెలంగాణ): గతంలో ఆటో డ్రైవర్గా పనిచేసి కుటుంబాన్ని పోషించానని, తనకు పక్షవాతం రాగానే అందరూ తనను ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయారంటూ సంస్థాన్నారాయణపూర్కు చెందిన కిషన్ అనే బాధితుడు రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్కు మొరపెట్టుకున్నాడు. బుధవారం బాధితుడు నేరేడ్మెట్లోని కమిషనర్ కార్యాలయానికి రావడంతో సీపీ తన చాంబర్ నుంచి బయటకు వచ్చి బాధితుడి వద్ద ఫిర్యాదు తీసుకొని అతడి గోడు విన్నారు. నాలుగేండ్ల కిందట తనకు పక్షవాతం వచ్చిందని, ఇంటికే పరిమితమైన తనను తన భార్య వదిలేసిందని, తన సంరక్షణ చూసుకునే వారు ఎవరూ లేకపోవడంతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నానని కిషన్ తన బాధను సీపీకి వివరించాడు. బాధితుడి కుటుంబసభ్యులతో మాట్లాడి వెంటనే సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను సీపీ ఆదేశించారు.
పర్వతారోహకుడికి అభినందన
ఇటీవల ఎవరెస్ట్ పర్వతం బేస్ క్యాంప్ను అధిరోహించిన తెలంగాణ యువ పర్వతారోహకుడు భూక్యా యశ్వంత్ను రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ అభినందించారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలానికి చెందిన యశ్వంత్ గత ఏడాది జూన్లో జమ్ముకశ్మీర్లోని ఎత్తైన ఖార్జుంగ్, ఆగస్టులో ఆఫ్రికా ఖండంలోని కిలిమంజారో పర్వతాలను, రష్యాలోని ఎత్తైన మౌంట్ ఎల్రోస్ అగ్ని పర్వతాన్ని అధిరోహించాడు. ఇటీవల హిమాచల్ ప్రదేశ్లోని మౌంట్ యూనమ్ పర్వతంపై జాతీయ పతాకాన్ని ఎగురవేశాడు. కాగా, పర్వతారోహణ ఎన్నో సవాళ్లతో కూడుకున్నదని, ఎంతో కష్టతరమైనదని సీపీ ఈ సందర్భంగా అన్నారు. భవిష్యత్లో యశ్వంత్ మరెన్నో విజయాలు సాధించి, రాష్ర్టానికి మరింత పేరు తీసుకురావాలని సీపీ చౌహాన్ ఆకాంక్షించారు.
భవిష్యత్లో మరిన్ని పతకాలు సాధించాలి..
తెలంగాణ రాష్ట్ర 9వ షూటింగ్ చాంపియన్షిప్ పోటీల్లో భాగంగా నిర్వహించిన 25 మీటర్ల సెంటర్ ఫైర్ పిస్టల్ విభాగంలో బంగారు పతకం, 10మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో కాంస్య పతకాన్ని సాధించిన రాచకొండ కమిషనరేట్ ఐటీ, కమ్యూనికేషన్స్ ఇన్స్పెక్టర్ ఎ.ప్రసన్నకుమార్ను సీపీ డీఎస్.చౌహాన్ అభినందించారు. భవిష్యత్లో మరిన్ని పోటీల్లో పాల్గొని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. రాచకొండ పోలీసు కమిషనరేట్ తరపున అన్ని రకాల తోడ్పాటు అందిస్తామన్నారు. ఇటీవల హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయ ఆవరణలోని సాట్స్ షూటింగ్ రేంజ్లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర 9వ షూటింగ్ చాంపియన్షిప్ పోటీల్లో భాగంగా సెంటర్ ఫైర్ పిస్టల్, ఎయిర్ పిస్టల్ విభాగాల్లో పోటీలు నిర్వహించారు.